చెన్నై: టీమిండియాతో వన్డే సిరీస్ నెగ్గాలంటే చెమటోడ్చక తప్పదంటున్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్. సిరీస్లో భారత్ను ఎలా ఎదుర్కోవాలో చెబుతూ తమ ఆటగాళ్లకు పలు సలహాలు సూచనలు ఇస్తున్నాడు. ముఖ్యంగా భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎదుర్కోవడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తమ క్రికెటర్లకు స్మిత్ సూచిస్తున్నాడు.
కుల్దీప్ బౌలింగ్ను ఎదుర్కోవాలంటే నెట్స్లో మరింత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరముందని, ఇందుకోసం భారత మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్ బౌలింగ్ను నెట్స్లో ప్రాక్టీస్ చేయాలని చెప్పుకొచ్చాడు. తమపై కుల్దీప్ పైచేయి సాధించకుండా ఉండేందుకు తాము అనుసరించబోయే వ్యూహం గురించి స్మిత్ వివరించాడు.

తొలి ఓవర్ నుంచే కుల్దీప్పై ఎదురుదాడికి దిగుతామని, అతని బౌలింగ్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడం ద్వారా అతన్ని ఒత్తిడికి గురిచేస్తామని అన్నాడు. కుల్దీప్ ఒక టాలెంటెడ్ బౌలర్ అని, ఈ సిరీస్ లో అతన్ని ఎదుర్కోవడం కచ్చితంగా సవాల్తో కూడుకున్నదేనని తెలిపాడు. కుల్దీప్ను ఎదుర్కోనేందుకు తమ కన్సల్టెంట్ బౌలర్ శ్రీధర్ శ్రీరామ్ బౌలింగ్ను ప్రాక్టీస్ చేస్తామని చెప్పుకొచ్చాడు.
కాగా, తన ఆరంగేట్రపు మ్యాచ్ లోనే ఆసీస్పై కుల్దీప్ నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆ అనుభవంతోనే కుల్దీప్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆసీస్ భావిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్-ఆసీస్ మధ్య తొలి వన్డే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మధ్యాహ్నాం గం.1.30ని.కు జరగనుంది.