బ్రిస్బేన్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన చివరి అంకానికి చేరుకుంది. బ్రిస్బేన్ వేదికగా శుక్రవారం నుంచి రహానే సేన ఆఖరి టెస్టు ఆడనుంది. ప్రస్తుతం సిరీస్లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. సిడ్నీ టెస్టును డ్రాగా ముగించిన టీమిండియా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. నాలుగో టెస్ట్ కోసం భారత ఆటగాళ్లు సాధనలో చెమటోడ్చారు. తొలి ప్రాక్టీస్ సెషన్ విజయవంతంగా ముగించారు. అయితే కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో భారత తుది జట్టుపై ఆసక్తి పెరిగింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నెట్ సెషన్లో తీవ్రంగా సాధన చేశాడు. రవీంద్ర జడేజా స్థానంలో అతడు స్థానం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
నెట్స్లో సాధన చేస్తున్న ఓపెనర్ శుబ్మన్ గిల్కు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేశాడు. స్పిన్, వేగంతో దూసుకొచ్చిన బంతుల్ని ఎదుర్కోవడానికి గిల్ కాస్త ఇబ్బందిపడ్డాడు. ఆఫ్ స్టంప్కు అవతల వేసిన ఓ బంతి గింగరాలు తిరుగుతూ గిల్ ప్యాడ్కు తగలింది. బ్యాట్స్మన్కు సమాధానం దొరకని ఆ బంతిని చూసి గిల్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. కాగా దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. 'కుల్దీప్ యాదవ్ వేసిన బంతి ఎలా ఉంది?. అది ఔట్ కదా?' అని కాప్షన్ పెట్టింది.
How is that from @imkuldeep18.😯
— BCCI (@BCCI) January 13, 2021
Would you give that OUT? 🤔 #TeamIndia #AUSvIND pic.twitter.com/ZkZwT6r6xD
భారత ఆటగాళ్లు అందరూ నెట్స్లో చెమటోడ్చారు. గాయంతో ఆఖరి టెస్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా సాధనలో పాల్గొనప్పటికీ బౌలింగ్ కోచ్ భారత్ అరుణ్తో కలిసి పేసర్లకు మార్గనిర్దేశం చేశాడు. కోచ్ రవిశాస్త్రితో కలిసి కంగారూలకు కళ్లెం వేయడానికి ప్రణాళికలు రచించడంలో సాయం చేశాడు. ఇక సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ యువ ఆటగాళ్లకు స్ఫూర్తిని నింపుతున్నాడు. కీలక ఆటగాళ్లు దూరమైనా సమష్టిగా పోరాడి విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
విమర్శించిన బీజేపీ ఎంపీకి.. దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన హనుమ విహారి!!
జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్లో ఒకరు తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే.. మొహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీతో పాటు శార్దూల్, నటరాజన్ ఇద్దరికీ అవకాశం వస్తుంది. రవీంద్ర జడేజా స్థానాన్ని సుందర్తో భర్తీ చేయాలని టీమ్మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కుల్దీప్ నెట్ సెషన్లో కష్టపడుతుండడంతో.. అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి.