హైదరాబాద్: ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న కుల్దీప్ యాదవ్ ఓ అద్భుత బంతికి ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను అవుట్ చేశాడు.
దీంతో 87 బంతలను ఎదుర్కొన్న వార్నర్ 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవలియన్కు చేరాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 34.1వ బంతిని వార్నర్ బ్యాక్ఫుట్ తీసుకొని ఆడగా బంతి ఎడ్జ్కు తగిలి స్లిప్లో ఉన్న కెప్టెన్ రహానే చేతిలో పడింది. దీంతో వార్నర్ పెవిలియన్కు చేరాడు.

అరంగేట్రం చేసిన టెస్టులోనే వార్నర్ లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ని అవుట్ కుల్దీప్ అవుట్ చేయడంతో జట్టు సభ్యులందరూ అతడిని అభినందించారు. మరోవైపు టెస్టుల్లో తొలి వికెట్ తీసిన ఆనందంలో భావోద్వేగానికి గురైన కుల్దీప్... కెప్టెన్ రహానేను హత్తుకున్నాడు.
డ్రెస్సింగ్ రూమ్ నుంచి కుంబ్లే, కోహ్లీ చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. 35 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఇక ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. కాగా 22 ఏళ్ల కుల్దీప్ ధర్మశాల టెస్టులో అరంగేట్రం చేశాడు.
అతని వయసు 22 ఏళ్లు. ఎడమ చేతి స్పిన్నర్. వాస్తవానికి గాయపడ్డ కోహ్లీ స్థానంలో తుది జట్టులో శ్రేయాస్ అయ్యర్ను తీసుకుంటారని అందరూ భావించారు. ఈ మేరకు అతడిని ధర్మశాలకు కూడా బీసీసీఐ పిలిపించింది. అయితే చివరి నిమిషంలో టీమ్ మేనేజ్మెంట్ కుల్దీప్కు తుది జట్టులో చోటు కల్పించి ఆశ్చర్య పరిచింది.
2014లో జరిగిన అండర్-19 వరల్డ్కప్లో కుల్దీప్ ఆడాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 22 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన కుల్దీప్ వాటిల్లో 723 పరుగులు స్కోర్ చేశాడు.
అత్యధిక స్కోరు 117 పరుగులు. ఇక బౌలర్గా 81 వికెట్లు తీశాడు.