

హైదరాబాద్: భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలివిగా మమ్మల్ని బోల్తా కొట్టించాడని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా మంగళవారం మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్పై కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ (5/24) ధాటికి విలవిలలాడిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (101నాటౌట్) అజేయ సెంచరీతో రాణించడంతో 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ "మ్యాచ్లో ఇంగ్లాండ్కి మెరుగైన ఆరంభం లభించింది. కానీ.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్కి వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. అతను చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి తెలివిగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ని బోల్తా కొట్టించాడు" అని అన్నాడు.
"మేము కూడా బాగా ఆడి ఉండాల్సింది. ఒకే ఓవర్లో మూడు కీలక వికెట్లు కోల్పోవడం జట్టుని దారుణంగా దెబ్బతీసింది. దీంతో.. 30-40 పరుగులు తక్కువగా చేశాం. కనీసం రెండో టీ20లోనైనా అతడి బౌలింగ్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తాం" అని మోర్గాన్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 13 ఓవర్లు ముగిసేసరికి కేవలం 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ 200 పరుగులు చేస్తుందని అంతా భావించారు. కానీ, 14వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ యాదవ్ వేసిన తన మూడో ఓవర్లో ఇంగ్లండ్ను శాసించాడు.
కుల్దీప్ బౌలింగ్లో ఆడలేక వరుస ఓవర్లలో అలెక్స్ హేల్స్ (8), ఇయాన్ మోర్గాన్ (7), జానీ బారిస్టో (0), జో రూట్ (0), జోస్ బట్లర్ (69) వికెట్లు సమర్పించుకున్నారు. ఒకే ఓవర్లో మోర్గాన్, జానీ బెయిర్ స్టో, జో రూట్లను పెవిలియన్కు చేర్చి ఇంగ్లాండ్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.
తాజా విజయంతో మూడు టీ20ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 ఇరు జట్ల మధ్య శుక్రవారం రాత్రి 10 గంటలకి కార్డిఫ్ వేదికగా జరగనుంది.