Kuldeep Yadav: ఆసియా కప్ 2025లో టీమిండియా ఇప్పటికే యూఏఈ, పాకిస్థాన్లను ఓడించి సూపర్-4 దశలోకి ప్రవేశించింది. అయితే భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లోని హ్యాండ్ షేక్ వివాదం టోర్నీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదాలపై భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పందిస్తూ.. తనకు బయటి విషయాలతో సంబంధం లేదని, కేవలం ఆటపైనే దృష్టి ఉందని వెల్లడించాడు.
నా ముందు ఉన్నది ఒక బ్యాటర్ మాత్రమే..
ప్రెస్ కాన్ఫరెన్స్లో కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్తో తర్వాతి మ్యాచ్ గురించి తనకు ఎటువంటి ఆందోళన లేదని చెప్పాడు.తాను మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు తన ముందు కేవలం ఒక బ్యాటర్ మాత్రమే ఉంటాడని.. పాకిస్థాన్తో ఆడినప్పుడు తాను ఎప్పుడూ ఇలాగే భావిస్తానని కుల్దీప్ యాదవ్ చెప్పాడు. తన బౌలింగ్ రిథ్ ఇప్పుడు కుదరిందని.. తాను మంచి ఫామ్ లో ఉన్నట్లు కుల్దీప్ పేర్కొన్నాడు. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా.. ఈ వికెట్ స్పిన్నర్లకు చాలా బాగుందన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ వికెట్ల కంటే ఇది మెరుగ్గా ఉందన్నాడు.

కుల్దీప్ యాదవ్ గతంలో ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్లలో రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఆసియా కప్లో ఆడిన రెండు మ్యాచ్లలో ఇప్పటివరకు ఏడు వికెట్లు పడగొట్టాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆడటంపై కుల్దీప్ మాట్లాడుతూ.. ఎక్కువ కాలం బ్రేక్ తీసుకున్న తర్వాత ఆడటం ఒక సవాలు అని తెలిపాడు. నిరంతరంగా ఆడితే ఫామ్ ను కొనసాగించవచ్చన్నాడు. కానీ మ్యాచ్లకు దూరం కావడం వల్ల కష్టం అవుతుందన్నాడు. కోచ్ గౌతమ్ గంభీర్తో తన కమ్యూనికేషన్ గురించి ప్రశ్నించగా.. "మా మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉంది. జట్టుకు బ్యాటింగ్లో లోతు అవసరం కావడంతో నాలుగు మ్యాచ్లలో నేను ఆడలేకపోయాను. నా స్కిల్స్లో లోపం కాదని, అది జట్టు కూర్పు గురించే అని కోచ్ స్పష్టంగా చెప్పారు. ఒక బౌలర్గా నా ప్రధాన పని వికెట్లు తీసుకోవడమే, దానితో పాటు నా బ్యాటింగ్ను కూడా మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని కుల్దీప్ తెలిపాడు.