ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్ లో కేకేఆర్పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విజయంలో 3/29తో కీలకంగా వ్యవహరించిన కృనాల్ పాండ్య మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం తన సోదరుడు, ముంబయి కెప్టెన్ హర్దిక్ పాండ్యను విమర్శించిన వారికి గట్టి సమాధానం ఇచ్చాడు. అలాగే గతంలో తన ప్రదర్శనపై విమర్శలు చేసిన వారికి కూడా వార్నింగ్ ఇచ్చాడు!
వాస్తవానికి హార్దిక్ పాండ్యకు గత సీజన్ ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చింది. గత సీజన్ లో రోహిత్ను తప్పించి పాండ్యకు ముంబయి జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించడంతో అతడిపై తీవ్రస్థాయిలో హేళనలు వచ్చాయి. ప్రతి మ్యాచ్ సమయంలోనూ ప్రేక్షకులు అరుస్తూ పాండ్యను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. పైగా అదే సమయంలో తన భార్య నటాషాతో విడిపోవడం కూడా అతడిని ఎంతగానో బాధించింది. కానీ ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన చేసి.. విమర్శలు చేసినవాని నుంచే ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ 2025లో ముంబయి సారథిగా అభిమానుల ముందుకు వచ్చాడు.

మమ్మల్ని చంపలేరు..
ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య.. విమర్శలపై స్పందించాడు.
"మీరు మమ్మల్ని బాధపెట్టగలరు. వేధించగలరు. కానీ మమల్ని చంపలేరు. ఎందుకంటే మేం మళ్లీ బలంగా తిరిగి పుంజుకోగలం. లేచి నిలబడతాం. హార్దిక్ పాండ్యా గత కొన్నేళ్లలో ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. నేను ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అతడు తన ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శిస్తూ, మ్యాచ్లను గెలిపించే సామర్థ్యాన్ని చూపిస్తున్నాడు. 2024 T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, అతడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ విజయం అతడికి ఎంత ముఖ్యమో తెలియజేసింది. అతడి పట్ల నేను ఎంతో గర్వంగా ఉన్నాను. ఎంతో ఆనందంగా ఉన్నాను," అని కృనాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు.