హైదరాబాద్: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తోన్న కృనాల్ పాండ్యా మే 21, 2017న తన స్నేహితురాలు పంకురి శర్మకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. అయితే, ప్రత్యేకించి అదే రోజున తన ప్రేమను తెలియజేయడానికి ఓ కారణం ఉందని తాజాగా తమ్ముడు హార్ధిక్ పాండ్యాతో కలిసి ఓ షోలో పాల్గొన్న కృనాల్ పాండ్యా వివరించాడు.
మే 21, 2017న జరిగిన ఐపీఎల్ ఫైనల్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ విజయం సాధించి మూడోసారి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతేకాదు ఆరోజు ముంబై ఇండియన్స్ ట్రోఫీని అందుకోవడంలో కృనాల్ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. తాజాగా ఐపీఎల్ 11వ సీజన్ ముగిసిన అనంతరం 'వాట్ద డక్ షో'లో ఈ అన్నదమ్ములిద్దరూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇద్దరూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. కృనాల్ పాండ్యా తన ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతూ 'గత ఏడాది ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన అనంతరం హోటల్కు వెళ్లగానే పంకురికి నా ప్రేమ గురించి చెప్పాను. ఎందుకంటే ఆ రోజుకెంతో ప్రత్యేకత ఉంది. మా జట్టు విజేతగా నిలిచింది' అని తెలిపాడు.
'నేను, హార్దిక్ ఒకే జట్టులో ఉన్నాం. విజేతలుగా నిలిచాం. ఫైనల్ మ్యాచ్లో నేను కీలక ఇన్నింగ్స్ ఆడాను. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాను. నా కలలన్నీ నిజం అయ్యాయి. నా జీవితంలో ఒకే రోజు ఇన్ని ప్రత్యేకతలు గతంలో ఏనాడు చూడలేదు. దీంతో ఆ రోజును మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలనుకున్నాను' అని వివరించాడు.
'అందుకే మ్యాచ్ అనంతరం హోటల్ గదికి వెళ్లగానే నేను పంకురికి నా ప్రేమ విషయం చెప్పేశా' అని అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇదే షోలో తమకు వెస్టిండిస్ క్రికెటర్లంటే అమితమైన ప్రేమ అని చిన్నప్పటి నుంచే వారిపై ఇష్టం కలిగిందని పాండ్యా బ్రదర్స్ వెల్లడించారు.
ఐపీఎల్ సందర్భంగా ఓ సందర్భంలో ఈ సోదరులు వెస్టిండీస్ ఆల్రౌండర్ కీరన్ పోలార్డ్ పెద్దన్న అని సంబోధించిన సంగతి తెలిసిందే. అయితే చిన్నప్పుడు ఎక్కువగా వెస్టిండీస్ మ్యాచ్లు చూడటంతో వారిపై ఇష్టం కలిగిందని, వారిలో ఏదో ప్రత్యేకత ఉందని... చాలా యాక్టివ్గా ఉంటారని తెలిపారు.