
ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా గుడ్ న్యూస్ చెప్పాడు. అతని భార్య పంకూరి శర్మ నేడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కృనాల్ పాండ్యా తన సోషల్ మీడియా అకౌంట్ అయిన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అతని భార్య అప్పుడే పుట్టిన బిడ్డను పట్టుకోగా.. ఆమె పక్కన తాను ఉండి బాబును చూస్తున్న ఫోటోను కృనాల్ షేర్ చేశాడు. తన కొడుకుకు కవిర్ కృనాల్ పాండ్యా పేరు పెట్టినట్లు తెలియజేశాడు. వీరిద్దరికి నెట్టింట అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే కొన్నాళ్ల పాటు పంకూరి శర్మతో డేటింగ్ చేసిన కృనాల్.. 2017 డిసెంబర్లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ల టైంలో పంకూరి తరచుగా స్టేడియంలో కనిపించేది. స్టాండ్స్లో కూర్చుని కృనాల్ను ఎంకరేజ్ చేసేది.
ఇక కృనాల్కు తన తమ్ముడు హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్ దంపతుల కుమారుడు అయిన అగస్త్య అంటే చాలా ఇష్టం. కృనాల్ తరచుగా అగస్త్యతో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. హార్దిక్కు అన్న కృనాల్ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే హార్దిక్ తీవ్రంగా గాయపడ్డ టైంలో కృనాల్, వదిన పంకూరి అతను కోలుకునేందుకు కావాల్సినంత హెల్ప్ చేశారు. ఇక ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసిన హార్దిక్ మంచి ప్రదర్శనలతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం హార్దిక్ రెస్ట్ మోడ్లో ఉన్నాడు. హార్దిక్ ఈ ఏడాది కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్సీ వహించి.. అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే ఆ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఐర్లాండ్ పర్యటనలో టీమిండియాకు నాయకత్వం వహించి రెండు టీ20ల సిరీస్ను 2-0తేడాతో గెలిపించాడు.
కృనాల్ పాండ్యా చివరిసారిగా 2021 జులైలో శ్రీలంక పర్యటనలో టీమిండియా తరఫున ఆడాడు. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కృనాల్ టీమిండియా తరఫున 5 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన కృనాల్ బ్యాటింగ్లో 183పరుగులు, బౌలింగ్లో 10వికెట్లు తీసి రాణించాడు.