టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్గా భారత్ నిలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి జగజ్జేతగా నిలిచింది. టీమిండియా ప్రపంచకప్ సాధించడంలో హార్దిక్ పాండ్యది కీలకపాత్ర. ఆల్రౌండర్గా జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. పవర్ప్లేలో, డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ బౌలర్గా సత్తాచాటాడు. అంతేగాక ఫినిషర్గా బ్యాటు ఝుళిపించాడు.
అయితే రెండు నెలల క్రితం ఈ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య పరిస్థితి దారుణంగా ఉంది. రోహిత్ శర్మ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ అందుకోవడాన్ని హిట్మ్యాన్, ముంబై జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. హార్దిక్ను స్టేడియంలో, బయటా అవమానించారు. హేళన చేశారు. మరోవైపు ఐపీఎల్లో కెప్టెన్గా, ప్లేయర్గా విఫలమయ్యాడు. దీంతో మాజీ క్రికెటర్లు సైతం హార్దిక్ను తీవ్రంగా విమర్శించారు.

కానీ కొన్ని రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. గతంలో విమర్శించిన వారి నుంచి హార్దిక్ ప్రశంసలు దక్కించుకున్నాడు. విక్టరీ పరేడ్లో, వాంఖడే స్టేడియంలో హార్దిక్ నామస్మరణతో దద్దరిల్లింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం హార్దిక్కు హ్యాట్సాఫ్ అంటూ క్రెడిట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్, హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్య స్పందించాడు. గతంలో హార్దిక్ ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మాట్లాడాడు. హార్దిక్ కూడా భావోద్వేగాలు కలిగిన మనిషే అని అందరూ మరిచిపోయారని కృనాల్ అన్నాడు.
హార్దిక్తో కలిసి తాను పదేళ్లుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాని, గత కొన్ని రోజులుగా జరిగింది చూస్తుంటే తమ కలలు నెరవేరినట్లుగా ఉందని కృనాల్ పాండ్య తెలిపాడు. హార్దిక్ సాధించిన విజయాన్ని చూసి తానెందో ఉద్వేగానికి లోనయ్యానని చెప్పాడు. గత ఆరు నెలలు తన తమ్ముడికి చాలా కష్టంగా గడిచాయని, జనాలు హార్దిక్ను దారుణంగా ఎగతాళి చేశారని అన్నాడు. హార్దిక్ కూడా అందరిలాగే భావోద్వేగాలు కలిగిన మనిషే అనే విషయాన్ని కూడా మరిచి హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు సాధించిన దానికి హార్దిక్ పూర్తిగా అర్హుడు అని కృనాల్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.