
ముంబై ప్లేయర్ కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా.. ఇద్దరు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. కృనాల్ 2016లో ముంబై జట్టులో చేరగా.. పొలార్డ్ పదేళ్లుగా ముంబై ఇండియన్స్ టీంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ గ్రౌండ్లో, బయట కూడా మంచి స్నేహితులుగా మెలిగేవారు. ఈ సీజన్లో కృనాల్ పాండ్యా లక్నోకు ఆడుతున్నాడు. ఆదివారం వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కీరన్ పొలార్డ్ను ఔట్ చేసిన తర్వాత కృనాల్ పాండ్యా అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చిన విధానం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 103నాటౌట్తో రాణించగా.. కృనాల్ మూడు వికెట్లు తీశాడు. లక్నో ప్లేయర్ల ప్రదర్శనకు ముంబై తన ఎనిమిదో ఓటమిని మూటగట్టుకుంది.

మాజీ టీమిండియా పేసర్ ఆర్పీ సింగ్ కూడా కృనాల్.. పొలార్డ్కు ఇచ్చిన సెండ్-ఆఫ్పై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. 'పొలార్డ్ మౌనంగా వెళ్లిపోయాడు కాబట్టి సరిపోయింది. ఓటమి బాధలో అతను వేరేలా స్పందించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఎందుకంటే ఓడిపోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. ఫామ్ బాగా లేనప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు ఓ ప్లేయర్ పట్ల ఎంత స్నేహమున్న అలా ప్రవర్తించకూడదు. నా ప్రకారం.. కృనాల్ బాగా ఓవర్గా ప్రవర్తించాడు.' అని పేర్కొన్నాడు. అయితే మ్యాచ్ అనంతరం కృనాల్ మాట్లాడుతూ.. 'నేను పొలార్డ్ను ఔట్ చేసినందుకు చాలా సంతోషపడ్డా. లేకుంటే నా మెదడును తినేవాడు. ఎందుకంటే అతను అంతకుముందు నన్ను ఔట్ చేశాడు. ఇక ఇప్పుడు 1-1తో లెక్క బ్యాలెన్స్ అయింది.' అని తెలిపాడు.