39 బంతుల్లో సెంచరీ:
కేపీఎల్లో బళ్లారి టస్కర్స్ తరఫున ఆడుతున్న కృష్ణప్ప గౌతమ్ బ్యాట్తోనూ, బంతితోనూ అదరగొట్టాడు. ప్రత్యర్థి జట్టు శివమొగ్గ లయన్స్కు పట్టపగలే చుక్కలు చూపించాడు. 56 బంతుల్లో 134 పరుగులు (నాటౌట్) చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో 13 సిక్సులు, ఏడు ఫోర్లు ఉన్నాయి. బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం 39 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ కేపీఎల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.

నాలుగు ఓవర్లు 8 వికెట్లు:
కృష్ణప్ప గౌతమ్ బంతితోనూ మెరిశాడు. పదునైన బంతులతో శివమొగ్గ లయన్స్ బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించాడు. కేవలం నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చి ఏకంగా ఎనిమిది వికెట్లు తీసాడు. గౌతమ్ సంచలన ప్రదర్శనతో రికార్డు నెలకొల్పాడు. గౌతమ్ తన జట్టును 70 పరుగుల తేడాతో గెలిపించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుకు ఎంపికయ్యాడు. గౌతమ్ బౌండరీల ద్వారా 106 పరుగులు సాధించడం విశేషం.

రికార్డులు బద్దలు:
39 బంతుల్లో సెంచరీ సాధించి కేపీఎల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన క్రికెటర్గా గౌతమ్ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా ఇదే. ప్రస్తుత కేపీఎల్ టోర్నమెంట్లో ఒక మ్యాచ్లో అత్యధిక సిక్సులు (13) కొట్టిన రికార్డు కూడా గౌతమ్ పేరిటే నమోదయింది. కృష్ణప్ప గౌతమ్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. 2019లో కూడా ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాడు.


Click it and Unblock the Notifications












