
అత్యుత్తమ క్షణం అదే:
తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... '2008లో బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు స్వీకరించా. 2011 ప్రపంచకప్ను గెలవగలిగే జట్టును సిద్ధం చేయాలన్నదే అప్పటి నా కల. దేవుడి దయ వల్ల మాకు ధోనీ లాంటి మంచి కెప్టెన్గా ఉన్నాడు. ప్రపంచకప్ విజయం నా క్రికెట్ ప్రయాణంలో అత్యుత్తమ క్షణం' అని పేర్కొన్నాడు.

కోహ్లీకి అవకాశాలు ఇచ్చాం:
'ఇప్పుడు మీకో విషయం గుర్తు చేయాలనుకుంటున్నా. విరాట్ కోహ్లీ ఈ రోజు ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్గా ఉన్నాడు. అతడికి మేము అవకాశాలు ఇచ్చాం. ఈ రోజు అతను ఎక్కడ ఉన్నాడో చూడండి. ఇది మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ రోజు 2011 భారత జట్టు గురించి మాట్లాడటం గర్వంగా ఉంది' అని శ్రీకాంత్ అన్నాడు. భారత్ తరఫున శ్రీకాంత్ 43 టెస్టులు, 146 వన్డేలు ఆడాడు.

2012 వరకు సేవలు:
టీమిండియాకు సారధిగా శ్రీకాంత్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. చివరి వన్డే 1992లో దక్షిణాఫ్రికాపై ఆడాడు. ఇక 2008 సెప్టెంబర్లో శ్రీకాంత్ టీమిండియా చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు అందుకున్నాడు. 2012 వరకు సేవలు అందించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించిన కోహ్లీకి శ్రీకాంత్ అవకాశాలు ఇచ్చాడు. శ్రీకాంత్ సెలక్టర్గా ఉన్న సమయంలోనే 2011లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.

28 సంవత్సరాల నిరీక్షణ:
ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఓపెనర్ గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేయగా.. ధోనీ అజేయంగా 91 పరుగులు చేశాడు. 275 పరుగుల లక్ష్యాన్ని భారత్ పది బంతులు మిగిలుండగానే ఛేదించింది. కపిల్ దేవ్ 1983లో టీమిండియాకు తొలికప్ అందించిన తరువాత రెండవ ప్రపంచకప్ కోసం 28 సంవత్సరాలు వేచిచూడాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications
