
ఐపీఎల్ జరగకపోతే..:
తాజాగా స్టార్ స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టెడ్'లో నాజర్ హుస్సేన్, కృష్ణమాచారి శ్రీకాంత్, వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొని పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోనీ భవితవ్యంపై కూడా చర్చ వచ్చింది. ఈ క్రమంలో నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ... 'టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అయితే నేను ఏమి చేస్తాను అనే దాని గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ జరగకపోతే.. భారత్ జట్టులోకి ధోనీ రీఎంట్రీ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లుతాయి. లోకేష్ రాహుల్ కీపర్ బాధ్యతలు మోస్తాడనుకుంటున్నా. రిషబ్ పంత్ కూడా మెగా టోర్నీలో ఆడడం సందేహమే. కానీ.. పంత్ ఎంతో ప్రతిభావంతుడు' అని అన్నాడు.

జట్టే ముఖ్యం, ఆ తర్వాతే వ్యక్తిగతం:
'నేను ఎంఎస్ ధోనీ వీరాభిమానిని. కానీ.. ఇక్కడ నేను ప్రపంచకప్, అందులో ఆడే జట్టు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. జట్టే ముఖ్యం, ఆ తర్వాతే వ్యక్తిగతం. నిజానికి ధోనీని ప్రపంచకప్ జట్టుతో పాటు తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు. ఇక ఐపీఎల్ జరగకపోతే.. మహీ టీ20 ప్రపంచకప్ కోసం తిరిగి జట్టులోకి రావడం చాలా కష్టం. మహీ చాలా ఫిట్, ఒక లెజెండ్, తెలివైనవాడు అని కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2020 సీజన్లో ఫామ్ నిరూపించుకుంటేనే:
2019 వన్డే ప్రపంచకప్లో చివరగా టీమిండియా తరఫున ఆడిన ధోనీ.. ఆ తర్వాత వరుస సిరీస్లకి దూరంగా ఉన్నాడు. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదు. దీంతో మహీ రిటైర్మెంట్పై ఒత్తిడి నెలకొంది. మరోవైపు ఇక ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఈ టోర్నీలోనూ ధోనీ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. ఐపీఎల్ 2020 సీజన్లో ఫామ్ నిరూపించుకోవాలని ఇప్పటికే టీమిండియా మేనేజ్మెంట్, చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. అయితే కరోనా వైరస్ కారణంగా టోర్నీ జరగడంపై సందేహాలు నెలకొన్నాయి.

ధోనీ సహజసిద్ధమైన అథ్లెట్:
ప్రపంచకప్ తర్వాత ధోనీ తిరిగి మైదానంలో అడుగుపెట్టకపోవడంతో అతను మళ్లీ ఆడితే మునుపటిలా జోరు ప్రదర్శించగలడా? బ్యాటింగ్లో రాణించగలడా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం, ఆటగాళ్లు మాత్రం మహీ సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ధోనీ సహజసిద్ధమైన అథ్లెట్ అని, అతను పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని సీఎస్కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ చెప్పాడు. 'దాదాపు గత పదేళ్లలో మహీ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం తొలిసారి చూశానని, వచ్చే ఐపీఎల్ సీజన్లో అతను ఉత్తమంగా రాణించడం కోసం దృష్టి పెట్టాడని చెప్పడానికి ఇది నిదర్శనమని' జట్టు ఫిజియో టామీ సిమ్సెక్ వెల్లడించాడు.


Click it and Unblock the Notifications
