T20 World Cup 2026: సౌత్ ఆఫ్రికాతో ఊహించని ఓటమి తర్వాత టీమిండియాపై వెల్లువెత్తిన తీవ్ర విమర్శలకు సమాధానం చెప్పాలంటే T20 ప్రపంచకప్ను గెలుచుకోవడమే సరైన మార్గమని భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే జట్టు త్వరగా పుంజుకుని, సమిష్టిగా మెరుగైన ప్రదర్శన చేయాలని ఆయన సూచించారు.గ్రూప్ స్టేజిలో భారత జట్టు అంచనాలకు మించి రాణించింది. నాలుగు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది. అయితే అహ్మదాబాద్లో జరిగిన సూపర్ 8 తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూడడంతో విజయ పరంపరకు బ్రేక్ పడింది.

ఈ ఓటమి కారణంగా సెమీఫైనల్కు ముందే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. ఒక మ్యాచ్ లో ఓడినంతామాత్రాన జట్టుపై ఇంత తీవ్ర విమర్శలు రావడం సమంజసమేనా అన్న ప్రశ్నకు శ్రీకాంత్ స్పందిస్తూ, ఈ విమర్శలకు సమాధానం చెప్పడానికి ఒకే మార్గం ఉంది - అది గ్రౌండ్ లో అద్భుతంగా ఆడితేనే అని స్పష్టం చేశారు. సెమీఫైనల్కు అర్హత సాధించి, ప్రపంచకప్ను గెలుచుకుంటే అందరికీ సరైన సమాధానం ఇచ్చినట్లవుతుంది. అలా గెలిచి చూపిస్తే విమర్శలు చేసినవారందరు నోళ్లు మూసుకుంటారు. ఇప్పుడు విమర్శిస్తున్న వారే అదే టీమిండియాను పొగడ్తలతో ముంచుతారు. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మలను ఆకాశానికి ఎత్తేస్తారు అని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.

ఆయన కొనసాగిస్తూ, క్రికెట్ లో ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. వరుస విజయాలతో ముందుకెళ్తేనే అందరూ పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ ఒకటి రెండు మ్యాచ్లలో ఓడితే మాత్రం విపరీతంగా ట్రోల్స్ చేస్తారు. భారత జట్టు ఆటగాళ్లు కూడా మనుషులే, కాబట్టి వారు కూడా పొరపాట్లు చేసే అవకాశం ఉంది. విమర్శలకు ప్రభావితం కాకుండా వాటిని గౌరవంగా స్వీకరించడం చాలా ముఖ్యం అని శ్రీకాంత్ వివరించారు.సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమికి ముందు టీమిండియా అద్భుతమైన ఫామ్లో ఉంది. చివరిగా ఆడిన 28 మ్యాచ్లలో 24 విజయాలు నమోదు చేసుకుంది.

సెమీఫైనల్కు చేరుకోవాలంటే, మిగిలిన రెండు సూపర్ 8 మ్యాచ్లలో జింబాబ్వే, వెస్టిండీస్లపై తప్పక విజయం సాధించాలి. స్టార్ ఆల్-రౌండర్ అక్షర్ పటేల్ను పక్కనపెట్టి, మరో ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకోవడంపై చాలా మంది అభిమానులు, విశ్లేషకులు మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంచి ఫామ్ లో ఉన్న అక్షర్ పటేల్ ను జట్టు నుండి ఎందుకు తప్పించారని అడుగుతున్నారు . వాస్తవానికి, అక్షర్ తన తొలి మూడు మ్యాచ్లలో 13 కంటే తక్కువ సగటుతో, 6.63 ఎకానమీ రేటుతో 6 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. కానీ, అతను భారత జట్టు ఆడిన చివరి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.దీనికి విరుద్ధంగా, టోర్నమెంట్లో వాషింగ్టన్ సుందర్ ఆడిన రెండు మ్యాచ్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.