హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఓటమి తప్పించుకునేందుకు శ్రీలంక బ్యాట్స్మన్ డిక్వెల్లా సమయాన్ని వృధా చేశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన షమి బౌలింగ్లో పదేపదే బంతికి బంతికి మధ్య టైమ్ తీసుకుంటుండటంతో అతనికి కోపమొచ్చింది.
ఊరించి ఊసురుమనిపించారు: కోల్కతా టెస్టు డ్రా, ఈడెన్లో కోహ్లీ తొలి సెంచరీ
దీంతో క్రీజులో ఉన్న డిక్వెల్లాపై షమీ ఆగ్రహం వ్యక్తంచేశాడు. అతని దగ్గరికి వెళ్లి ఏదో మాటన్నాడు. ఆ తర్వాతి బంతికి డిక్వెలా మళ్లీ అలాగే చేయడంతో ఈసారి కెప్టెన్ విరాట్ కోహ్లీ నేరుగా అంపైర్ దగ్గరికి వెళ్లి అతనిపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరు అంపైర్లు కలిసి ప్లేయర్స్ను శాంతింపజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇదిలా ఉంటే చివరిరోజైన సోమవారం ఆటలో భాగంగా 231 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు కోల్పోయి 75 పరుగుల వద్ద ఉండగా బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ను అంఫైర్లు నిలిపివేశారు. దీంతో విజయం దిశగా పయనించిన కోహ్లీసేన డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు తీయగా, షమీ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్కు ఒక వికెట్ దక్కింది. ముఖ్యంగా శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు సత్తా చాటారు. 352/8 వద్ద భారత్ తన రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన అనంతరం రెండో ఇన్నింగ్స్ను ఆరంభం నుంచే వరుస వికెట్లను కోల్పోయింది.
22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ దినేష్ ఛండీమాల్ (20), డిక్ వెల్లా(27)లు రాణించడంతో తిరిగి తేరుకుంది. వీరిద్దరూ జట్టు స్కోరు 69 పరుగుల వద్ద అవుటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన పెరీరా డకౌట్గా వెనుదిరిగడంతో భారత్ విజయం దాదాపు ఖాయంగా కనబడింది. కాగా, చివర్లో ఓవర్లు ఉన్నప్పటికీ... వెలుతురులేని కారణంతో మ్యాచ్ను నిలిపివేయడంతో ఇరు జట్లు డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.