మ్యాచు పాయె.. డబ్బులూ పోయె
ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ కష్టాలు ఇప్పట్లో ముగిసేలా లేవు. ఈ సీజన్లో ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఒక్క విజయాన్నీ అందుకోలేదు. పలువురు కీలక ఆటగాళ్లు గాయాలపాలై టోర్నీ నుంచి ఇప్పటికే తప్పుకొన్నారు. అజింక్య రహానేకు కష్టాలు ఒకదాని వెంట ఒకటి వెంటాడుతున్నాయి. వరుస ఓటములతో ఇప్పటికే విమర్శల పాలైన రహానేపై ఇప్పుడు బీసీసీఐ లక్షల రూపాయల మేర జరిమానా విధించింది.
జట్టు స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు బోర్డు పేర్కొంది. కోల్కతా జట్టు ఖాతాలో వరుసగా అయిదో ఓటమి పడింది. చెన్నై సూపర్ కింగ్స్ తో చెపాక్ చిదంబరం స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పరాజయం పాలైందీ జట్టు. దీని తరువాత బీసీసీఐ కెప్టెన్ అజింక్య రహానేపై భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఇది జట్టుకు మరింత ఆందోళన కలిగించింది. రహానే ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించడమే దీనికి కారణం.

చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ సకాలంలో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. దీనికి ప్రతిఫలంగా, చివరి ఓవర్లో ఒక ఫీల్డర్ను బౌండరీ లైన్ వద్ద తగ్గించారు. మ్యాచ్ అనంతరం రహానేను స్లో ఓవర్ రేట్ కారణంగా 12 లక్షల రూపాయల జరిమానా విధించారు రెఫరీ. ప్రస్తుతానికి రహానేపై మాత్రమే జరిమానా పడింది. ఈ సీజన్లో కేకేఆర్ మళ్ళీ స్లో ఓవర్ రేట్కు పాల్పడితే కెప్టెన్తో పాటు జట్టులోని ఆటగాళ్లందరికీ భారీ జరిమానాలు తప్పవు.
తదుపరి ఉల్లంఘనకు రహానేకు రూ. 24 లక్షలు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలాగే ప్లేయింగ్ 11 ఆటగాళ్లు, ఇంపాక్ట్ ప్లేయర్కు వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా ఆరు లక్షలు చొప్పున జరిమానా ఉంటుంది. దీంతో కేకేఆర్ మరింత జాగ్రత్తగా అడుగులు వేయక తప్పదు. ప్రస్తుత సీజన్లో కోల్కతా జట్టు ఆడిన అయిదింట్లో నాలుగు ఓడిపోయింది. వారి వద్ద ఉన్నదీ ఒక్క పాయింటే. అది కూడా పంజాబ్ కింగ్స్తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడం వల్ల వచ్చింది.
ఈ సీజన్ లో ఇప్పటికే ఇద్దరు కేప్టెన్లు స్లో ఓవర్ రన్ రేట్ ను నమోదు చేశారు. ఫైన్ భరించారు. పంజాబ్ కింగ్స్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రెండుసార్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. మార్చి 31న న్యూ చండీగఢ్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్-రేట్ కారణంగా అతడు సీజన్లో మొదటిసారి జరిమానాకు గురయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications