IPL 2021 Auction: నాన్న మాట విని తప్పు చేశా.. అమ్మ మాట వింటే ఇప్పుడు కింగ్ అయ్యేవాడిని: దినేశ్ కార్తిక్

చెన్నై: అంచనాలకు అందని రీతిలో సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ వేలం అనూహ్య జాక్పాట్లు.. అంతకుమించిన షాక్లతో ముగిసింది. ఈ వేలంలో ఫ్రాంచైజీలన్నీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్రౌండర్ల వైపు మొగ్గు చూపాయి. దీంతో వారికి భారీ ధర పలికింది. పేసర్లు క్రిస్ మోరీస్ను రాజస్థాన్ రాయల్స్ రూ.16.25 కోట్లు రికార్డు ధరకు కొనుగోలు చేయగా.. జై రిచర్డ్సన్ను పంజాబ్ కింగ్స్ రూ.14 కోట్లకు తీసుకుంది. ఫాస్ట్ బౌలర్ కైల్ జెమీసన్కు రూ.15కోట్లు దక్కాయి. ఇక ఆల్రౌండర్లు గ్లెన్ మ్యాక్స్వెల్ రూ.14.25 కోట్లు, షకీబ్ అల్ హసన్ 3.20 కోట్లు, మోయిన్ అలీ రూ. 7 కోట్లు, కృష్ణ ప్ప గౌతమ్ రూ.9.25 కోట్లు భారీ ధరకు అమ్ముడుపోయారు.

అమ్మ మాట వినాల్సింది:
గురువారం జరిగిన ఐపీఎల్ 2021 వేలంలో ఫాస్ట్ బౌలర్లపై జట్టు యాజమాన్యాలు ఆసక్తి చూపించి ఎక్కువ పెట్టుబడి పెట్టాయి. ఈ వేలం పాటపై టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ సరదాగా స్పందించాడు. తాను వాళ్ల అమ్మ చెప్పిన మాట వినాల్సిందన్నాడు. అమ్మ మాట వింటే ఇప్పుడు ఐపీఎల్ 2021 వేలంలో తాను కింగ్ అయ్యవాడినని డీకే అభిప్రాయపడ్డాడు. 'నువ్వు ఫాస్ట్ బౌలర్వి కావాలని మా అమ్మ నాకు చెపుతూ ఉండేది. కానీ నేను మా నాన్న మాట విన్నాను. వికెట్ కీపర్, బ్యాట్స్మన్ అయ్యాను. మా ఇంట్లో అమ్మకు ముందు చూపు ఎక్కువ. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది' అని డీకే ట్వీట్ చేశాడు. అమ్మ చెప్పినట్లుగా ఫాస్ట్ బౌలర్ అయ్యుంటే.. తనకు కూడా భారీ ధర వచ్చేదని కార్తిక్ అంటున్నాడు.

డీకేకు రూ.7.4 కోట్లు:
ప్రస్తుతం దినేశ్ కార్తిక్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్లోనూ కొన్ని మ్యాచ్లకు సారథ్యం కూడా చేశాడు. అయితే కోల్కతా జట్టు సత్ఫలితాలు రాబట్టలేకపోవడంతో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. దీంతో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తీసుకున్నాడు. కార్తీక్కు కోల్కతా జట్టు గతేడాది రూ.7.4 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది కూడా ఆ జట్టుకే అతడు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఫామ్లేమితో పాటు భారత జట్టు వికెట్కీపర్ స్థానానికి విపరీతమైన పోటీ ఉండటంతో భారత జట్టులో కార్తిక్ చోటు దక్కించుకోలేకపోతున్నాడు.

బౌలర్ ఎందుకు కాలేదు:
రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సామ్ బిల్లింగ్స్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో అతనికి ఈ సారి నిరాశే ఎదురైంది. దీంతో అతను ట్విటర్ వేదికగా వేలం జరిగిన తీరుపై తనదైన శైలిలో స్పందించాడు. బౌలర్గా ఎందుకు కాలేదని తన గర్ల్ ఫ్రెండ్ అడుగుతుందని ట్వీట్ చేశాడు. 'ఐపీఎల్ 2021 వేలం చూసి నా గర్ల్ ఫ్రెండ్ సారా.. నువ్వు బౌలర్ ఎందుకు కాలేదని ప్రశ్నిస్తుంది' అని బిల్లింగ్స్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.

మెరిడిత్కు భారీ ధర:
ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్ ఐపీఎల్ 2021 వేలంలో 8 కోట్లకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అతడిని ఎగురేసుకుపోయింది. 40 లక్షల బేస్ ప్రైజ్తో అతనిపై బిడ్డింగ్ స్టార్ట్ అయ్యింది. కింగ్స్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు.. మెరిడిత్ను సొంతం చేసుకునేందుకు వేలంలో తీవ్ర పోటీపడ్డాయి. అయితే అనూహ్య రీతిలో భారీ ధరకు మెరిడిత్ను పంజాబ్ చేజిక్కించుకున్నది. ఆస్ట్రేలియాలోని బీబీఎల్ టీ20 టోర్నీలో అతను హోబర్ట్ హరికేన్స్ జట్టుకు ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications