హైదరాబాద్: కోల్కతాలో విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ గుండెపోటు రావడంతో 21 ఏళ్ల యువ క్రికెటర్ మృతి చెందాడు. ఈ విషాద ఘటన కోల్కతాలో చోటు చేసుకుంది. స్థానిక పైక్పారా స్పోర్ట్స్ క్లబ్ క్రికెటర్ అనికెత్ శర్మ (21) మంగళవారం ప్రాక్టీస్ చేస్తుండగా అనికెత్ శర్మ ఛాతీలో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు.
దీంతో సహచర క్రికెటర్లు వెంటనే అతడిని సిటీ ఆస్పత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. "మేమంతా అక్కడే గ్రౌండ్లో వార్మప్ చేస్తున్నాం. తాను ఫుల్బాల్ ఆడతానని అంకిత్ మాతో చెప్పాడు. కొద్దిసేపటికే ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. అయినా ప్రయోజనం లేకుండా పోయింది" అని సహచర ఆటగాడు కన్నీటి పర్యంతమవుతూ చెప్పాడు.
గతేడాదే క్లబ్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అనికేత్ మంచి బ్యాట్స్మన్, బెస్ట్ ఫీల్డర్ అని కోచ్ తెలిపారు. ఇక అనికేత్ మృతిపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) విచారం వ్యక్తం చేసింది. క్యాబ్ సెక్రటరీ అవిషేక్ దాల్మియా మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరమన్నారు.
అనికేత్ మృతితో బుధవరం జరగాల్సిన మ్యాచ్ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధకరమన్నారు. కష్టపడేతత్వం గల క్రికెటరని, భవిష్యత్లో గొప్ప క్రికెటర్ అవుతాడని అందరం భావించామన్నారు. అనికేత్ మరణ వార్త విని ఒక్కసారి షాక్కు గురయ్యాయని పైక్పారా స్పోర్ట్స్ క్లబ్ సారథి సంబ్రాన్ బెనర్జీ అన్నారు.