కోల్కతా: క్రికెట్ ఆట మరో క్రికెటర్ ప్రాణం తీసింది! కోల్కతా క్లబ్ క్రికెటర్ ఒకరు చికిత్స పొందుతూ సోమవారం నాడు మృతి చెందాడు. అండర్ 19 క్రికెట్లో భాగంగా ఆడుతున్న ఆటలో శుక్రవారం నాడు బెంగాల్ అండర్ 19 క్రికెట్ సారథి అంకిత్ కేసరి తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు కన్నుమూశాడు.
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సీనియర్ నాకౌట్ పోటీల్లో భాగంగా శుక్రవారం నాడు మ్యాచ్ సమయంలో ప్రత్యర్థి జట్టు భవానీపూర్ క్లబ్ ఆటగాడు కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు అంకిత్తో పాటు మరో ఆటగాడు సౌరవ్ మండల్ పరుగు పెట్టారు.

ఈ ప్రయత్నంలో వారిద్దరు ఒకరికి మరొకరు గట్టిగా ఢీకొన్నారు. దీంతో అంకిత్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతనిని వెంటనే కోల్కతా సిటీ ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంకిత్ కేసరి 1994 అక్టోబర్ 28న జన్మించాడు.
అతను అండర్ 19, ఈస్ట్ జోన్ అండర్ 19, బెంగాల్ అండర్ 23 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 47 మ్యాచులు ఆడాడు. ఇతను రైట్ హ్యాండెడ్ బ్యాట్సుమెన్. ఈ ఘటనతో కోల్కతా క్రికెట్ విషాదంలో మునిగిపోయింది. గత ఏడాది నవంబర్ నెలలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ బంతి తగిలి మృతి చెందిన విషయం తెలిసిందే.
అంకిత్ మృతికి షారుక్ సంతాపం
అంకిత్ కేసరి మృతికి బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారూక్ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు. అంకిత్ కేసరి మృతి విచారకరమని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని కోరుకుంటున్నానని చెప్పారు.