కరాచీ: భారత యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసల్లో ముంచెత్తారు. అతని నుంచి ఏ విధంగా ఆడాలో నేర్చుకోవాలని కొందరు అంటే, అతను వ్యూహాత్మకంగా ఆడిన తీరు అద్భుతమని మరికొందరు పేర్కొన్నారు.
మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరో అడుగు ముందుకేసి కోహ్లీకి సచిన్ తెండూల్కర్ మాదిరి ఉజ్వల భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. మహమ్మద్ అమీర్ నిప్పులు చెరిగే బంతులు వేయడం, కోహ్లీ వాటిని ఆడడాన్ని చూస్తున్నప్పుడు తన బౌలింగ్లో సచిన్ టెండూల్కర్ ఆట గుర్తుకొచ్చిందని చెప్పాడు. కోహ్లీని సమర్థుడైన బ్యాట్స్మన్గా అతను అభివర్ణించాడు.

కోహ్లీని చూసి నేర్చుకోవాలి: యూసుఫ్
ఎలాంటి పిచ్లపై ఏ విధంగా ఆడాలన్న విషయాన్ని భారత బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని పాక్ క్రికెటర్లకు మాజీ కెప్టెన్ మహమ్మద్ యూసుఫ్ సలహా ఇచ్చాడు. బ్యాట్స్మెన్కు పిచ్ ఏమాత్రం సహకరించలేదన్న వాదన వినిపించిందని, అయితే, అలాంటి పిచ్లపై ఎలా ఆడాలన్నది కోహ్లీని చూసి నేర్చుకోవాలని అన్నాడు.
అద్భుతమైన బంతులకే పాక్ బ్యాట్స్మన్ అవుటయ్యారని చెప్పే పరిస్థితి లేదని యూసుఫ్ వ్యాఖ్యానించాడు. 'బ్యాట్స్మెన్ అవుటైనవన్నీ తిరుగులేని బంతులుగా అనుకోవద్దు. అలాంటి అసాధారణ బంతి ఒక్కదానినైనా చూపగలరా' అని నిలదీశాడు. రిటైర్మెంట్పై పునరాలోచిస్తానని కెప్టెన్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలపై యూసుఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అఫ్రిదీ రిటైరైతేనే మంచిదని చెప్పాడు. కోచ్నిగానీ, అతని సహాయకులనుగానీ నిందించడానికి వీల్లేదని స్పష్టం చేశాడు. ఒక జట్టులోని ఆటగాళ్లంతా చెప్పింది వినడానికి, పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంకాకపోతే ఎవరైనా ఏం చేస్తారని ప్రశ్నించాడు. కోహ్లీ బ్యాటింగ్ చేసే విధానాన్ని పరిశీలించి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చని పాక్ బ్యాట్స్మెన్కు హితవు పలికాడు.
జరిమానా:
అంపైర్ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసిన కారణంగా కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్తో శనివారం జరిగిన మ్యాచ్ 15వ ఓవర్లో కోహ్లీ ఎల్బి అయ్యాడు. అయితే, అంపైర్ తీసుకున్న నిర్ణయం పొరపాటన్న రీతిలో కోహ్లీ నిరసన వ్యక్తం చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగానే కోహ్లీకి జరిమానా విధించామని ఐసిసి వివరించింది.