ముంబయి ఇండియన్స్తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. పదేళ్ల తర్వాత వాంఖెడె స్టేడియంలో ముంబయిపై గెలుపొంది. అయితే సాధారణంగా మ్యాచ్ అంటేనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంతో దూకుడుగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు కోపంతో ఊగిపోతుంటాడు కూడా. తాజాగా ఎంఐతో జరిగిన మ్యాచులోనూ ఇదే చేశాడు. తమ జట్టు ఆటగాళ్లపై కోపంతో తన క్యాపును మైదానంలోకి విసిరేసి, గట్టిగా అరుస్తూ అసహనం వ్యక్తం చేశాడు.
అసలేం జరిగిందంటే?
ఈ ఉత్కంఠ పోరులో మొదట టాస్ గెలిచిన బెంగళూరు జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనలో ముంబయి తొలి 10 ఓవర్లలో తక్కువ స్కోరే చేసి ఇబ్బంది పడింది. రోహిత్ శర్మ (17), రికిల్టన్ (17), విల్ జాక్స్ (22)..ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అయితే అనంతరం యాక్షన్ కింగ్ సూర్యకుమార్ యాదవ్ రావడంతో (28) ఆర్సీబీ కాస్త టెన్షన్లో పడింది.

అయితే 12వ ఓవర్ లో బౌలింగ్కు వచ్చిన యశ్ దయాల్, తన రెండో బంతిని సూర్యకుమార్ పై సంధించాడు. ఆ బంతిని సూర్యకుమార్ షాట్ ఆడగా.. ఆకాశంలోకి ఎగిరింది. అప్పుడు క్యాచ్ కోసం వికెట్ కీపర్ జితేశ్ శర్మ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ యశ్ దయాల్ దాన్ని పట్టించుకోకుండా బంతిని పట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే యశ్ దయాల్.. బంతిపైనే దృష్టి పెట్టి జితేశ్ శర్మకు తగిలాడు. ఈ గందరగోళ పరిస్థితిలో ఇద్దరూ క్యాచ్ మిస్ చేసేశారు. దీంతో ఈజీగా ఔట్ అవ్వాల్సిన సూర్య బ్రతికిపోయాడు.
దీంతో ఈ చెత్త ఫీల్డింగ్ చూసిన విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. వెంటనే తన కోపాన్ని ప్రదర్శిస్తూ.. టోపీని నెలకేసి కొట్టాడు. గట్టిగా అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ ఆర్సీబీ అదృష్టం కొద్ది.. సూర్యకుమార్ ఎక్కువ పరుగులు చేయకుండానే.. అదే ఓవర్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. ఆ సమయంలో అతడు 26 బంతుల్లో 28 పరుగులే చేయగలిగాడు.
ఇక ఆ తర్వాత దశలో తిలక్ వర్మ (29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 42) ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడి ముంబయికి ఆశలు కలిగించారు. కానీ వారు కూడా కీలక సమయాల్లో ఔటయ్యారు. దీంతో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే చేసింది. ఆర్సీబీపై 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.