హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవడంపై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ స్పందించాడు. కోహ్లికి కెప్టెన్సీ బాధ్యతలు అందించేందుకు ఇదే సరైన సమయమని ధోని భావించి ఉంటాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్ కన్సల్టింగ్, మేనేజ్మెంట్ సంస్థ ఐటీడబ్ల్యుకు చెందిన టాలెంట్ మేనేజ్మెంట్ ఆర్మ్ ఐటీడబ్ల్యు బ్లిట్జ్తో అశ్విన్ ఒప్పందం చేసుకున్నాడు.
ఈ సందర్భంగా చెన్నైలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. ధోని నిర్ణయాన్ని గౌరవించాలని అశ్విన్ హితవు పలికాడు. కెప్టెన్ పదవి నుంచి ధోనీ వైదొలగడం ఆయన వ్యక్తిగత విషయమని, దానిని అందరూ గౌరవించాలని కోరాడు. ధోని కెరీర్ అద్భుతంగా సాగిందని, గొప్ప గొప్ప కెప్టెన్లు కూడా అతని నుంచి నాయకత్వ పాఠాలు నేర్చుకోవచ్చని అశ్విన్ అన్నాడు.

ధోని సాధించిన ఘనతలను మరొకరు అందుకోవడం చాలా కష్టమని అశ్విన్ చెప్పాడు. భారత జట్టుకు కెప్టెన్గా ధోని అద్భుతమైన విజయాలనందించాడని, ఆ విషయాన్ని ఎవరూ విస్మరించలేరని అన్నాడు. ధోని హయాంలోనే సమర్థవంతులైన యువకులు జట్టులో వచ్చారని అన్నాడు. ఇక ధోని బాటలోనే కోహ్లీ కూడా విజయవంతం అవుతాడని అశ్విన్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
గంగూలీ తర్వాత అతడి లాగా నాయకత్వం వహించే నాయకుడు వస్తాడా? అందరూ భావించారు. అలాంటి సమయంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన ధోని భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడని చెప్పాడు. ఇదిలా ఉంటే 2016 సంవత్సరానికి గాను అశ్విన్కు ఐసీసీ 'టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్', 'ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డులు లభించాయి.