
1-4తో సిరిస్ను చేజార్చుకున్న టీమిండియా
ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడటంలో మనోళ్లు సఫలం కాలేకపోయారు. ఫలితంగా ఈ ఏడాది వరుసగా రెండో విదేశీ పర్యటనను 1-4తో ప్రత్యర్థికి సమర్పించుకోవాల్సిన పరిస్థితి. ఇంగ్లీషు గడ్డపై టీమిండియా ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో చేదు అనుభవాలు చవిచూసిన కోహ్లీ బ్యాట్స్మన్గా ఈసారి సత్తా చాటాడు. అయితే, కెప్టెన్గా మాత్రం విఫలమయ్యాడు. గత పర్యటనలో కోహ్లీ ఆడిన 10 ఇన్నింగ్స్ల్లో కేవలం 134 పరుగులకు పరిమితమయ్యాడు. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ స్వింగ్ ధాటికి విలవిలలాడిపోయాడు. పదింటిలో విరాట్ను అండర్సన్ నాలుగు సార్లు పెవిలియన్ పంపాడు.

బ్యాట్స్మెన్గా అత్యధిక పరుగులు
దీంతో కోహ్లీ ఈసారి ఎలా ఎదుర్కొంటాడో అనే విషయమై సిరీస్ ఆరంభానికి ముందు చర్చోపచర్చలు జరిగాయి. కానీ ఆండర్సన్ ఓ ఆటాడుకొని కోహ్లీ సునాయాసంగా పరుగులు సాధించడం విశేషం. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో విరాట్ 593 పరుగులు చేసి, ఎన్నో రికార్డులను అలవోకగా అధిగమించాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్గా రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లిష్ స్టార్ పేస్ జోడీ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ను గతానికి భిన్నంగా ఆత్మవిశ్వాసంతో ఆడిన విరాట్ ప్రపంచ మేటి బ్యాట్స్మెన్లలో తాను ఒకడినని ఘనంగా చాటిచెప్పాడు.

కెప్టెన్గా విఫలం
బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ... కెప్టెన్గా జట్టుకు విజయాలు అందించడంలో విఫలమయ్యాడు. మొత్తంగా ఐదు టెస్టుల్లో ప్రత్యర్థి కెప్టెన్ జో రూటే టాస్ గెలవడం విశేషం. దీంతో మూడో టెస్ట్ మినహాయిస్తే మిగతా మ్యాచ్ల్లోనూ టీమిండియా ఓటమిపాలైంది. సుదీర్ఘ టెస్ట్ సిరీస్కు సన్నాహం నుంచి మొదలుపెడితే.. జట్టు ఎంపిక, ఓపెనర్ల పేలవ ప్రదర్శన, బ్యాట్స్మెన్ తడబాటు, బౌలర్ల నిలకడలేమి మొదలైనవి జట్టుకు కీలక కారణాలుగా మారాయి. దీంతో కోహ్లీ కేవలం బ్యాటింగ్కే పనికొస్తాడని, నాయకునిగా వ్యూహాలు రచించడంలో విఫలమయ్యాడని మాజీలు విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే, గతంలో ఎన్నడూ లేని రీతిలో పేస్ బౌలర్లు ఇషాంత్శర్మ(18), జస్ప్రీత్ బుమ్రా(16), మహమ్మద్ షమీ(14) అదరగొట్టారు.

ఓటమికి కారణమైన జట్టు ఎంపిక
ఇంగ్లాండ్ పర్యటనలో వైఫల్యానికి మరో ప్రధాన కారణం జట్టు ఎంపిక. వేదికను బట్టి జట్టును ఎంపిక చేయాల్సింది పోయి మ్యాచ్ మ్యాచ్కు ఆటగాళ్లను మార్చడం మొత్తానికే కొంపముంచింది. ట్రెంట్బ్రిడ్జ్లో ఎంతో పట్టుదలగా క్రీజులో నిలవడంతో పాటు సెంచరీ చేసి ఆ టెస్టు విజయంలో కీలక భూమిక పోషించిన పుజారాకు తొలి టెస్టు నుంచి తప్పించడం పెద్ద తప్పిదం. హార్దిక్ పాండ్యాపై కోహ్లీ అతిగా ఆధారపడడమూ చేటు చేసింది. ఈ సిరీస్లో అతడి చెప్పుకోతగ్గ ప్రదర్శన ఏదైనా ఉందంటే ట్రెంట్బ్రిడ్జ్లో హాఫ్ సెంచరీ చేయడం, ఐదు వికెట్ల తీయడమే. నాలుగు టెస్ట్ల్లో 164 పరుగులకు పరిమితమయ్యాడంటే పాండ్యా ఆట ఎలా ఉందో తెలుస్తుంది.

ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో ఏకైక స్పిన్నర్ను ఎంచుకోవడం
ఇక, స్పిన్కు అనుకూలించిన ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో ఏకైక స్పిన్నర్ను ఎంచుకోవడం ఒకటైతే.. సీమ్ బౌలింగ్ను అనుకూలించిన లార్డ్స్ టెస్ట్లో అశ్విన్, చైనామన్ కుల్దీప్ యాదవ్ను తీసుకోవడం కొంపముంచింది. ఇంగ్లిష్ బ్యాట్స్మెన్పై ఏ మాత్రం ప్రభావం చూపని కుల్దీప్ యాదవ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి టెస్ట్లో కరుణ్ నాయర్ను తప్పించి ఆంధ్ర కుర్రాడు హనుమ విహారికి అవకాశమిచ్చారు. తనకు దక్కిన అవకాశాన్ని విహారి రెండుచేతులా అందిపుచ్చుకుని కోహ్లీ నమ్మకం నిలబెట్టడం ఎంపికలో కొంతలో కొంత ఊరట కలిగించే అంశం.

ఓపెనింగ్ సమస్య
టెస్టుల్లో ఏ జట్టుకైనా శుభారంభం ముఖ్యం. ఓపెనర్లు అందించే ఆరంభాన్ని బట్టి స్కోర్లు ఆధారపడి ఉంటాయి. ఓపెనర్లు విఫలమైతే.. ఆ భారమంతా మిడిలార్డర్పై పడుతుంది. దీంతో ఒత్తిడికిలోనై స్వల్ప స్కోర్లకే వెనుదిరుగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంగ్లాండ్తో ఐదు టెస్ట్ల్లో భారత జట్టుకు ఇదే అనుభవం ఎదురైంది. రెండు మ్యాచ్లాడిన మురళీ విజయ్ 26 పరుగులకు పరిమితమైతే.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 4 మ్యాచ్ల్లో 162 పరుగులు చేశాడు. 2013 దక్షిణాఫ్రికా పర్యటన నుంచి కూడా పేలవమైన టెక్నిక్తో మేటి టెస్ట్ జట్లపై అతడు విఫలమవుతూ వస్తున్నాడు. మరోవైపు ఐదు మ్యాచ్ల్లో కేఎల్ రాహుల్ ఓ సెంచరీతో 299 పరుగులు చేసి కొంతలో కొంత ఫర్వాలేదనిపించాడు.


Click it and Unblock the Notifications












