హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సీఆర్ఫీఎఫ్ జవాన్ల కుటుంబాలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సంతాపాన్ని తెలియజేశారు. రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా తొలి టీ20 జరగనుంది.
India vs Pakistan: భారత్లా పాక్ రాజకీయాల్ని కలపదు: సర్ఫరాజ్
తొలి టీ20 నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. వరల్డ్కప్లో పాకిస్థాన్తో మ్యాచ్ ఆడే విషయమై కేంద్ర ప్రభుత్వం, క్రికెట్ బోర్డు నిర్ణయిస్తుందని కోహ్లీ అన్నాడు. ఈ అంశంలో దేశం ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉన్నామని చెప్పాడు. ప్రభుత్వం, బోర్డు తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని కోహ్లీ అన్నాడు.
#WATCH Virat Kohli on Ind Vs Pak in World Cup says, "Our sincere condolences to the families of CRPF soldiers who lost their lives in #PulwamaAttack. We stand by what the nation wants to do and what the BCCI decides to do." pic.twitter.com/gjyJ9qDxts
— ANI (@ANI) February 23, 2019
వరల్డ్కప్లో భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందా? లేదా అన్నది ప్రస్తుతం క్రికెట్ అభిమానుల మదిని తొలుస్తోన్న ప్రశ్న. ఈ విషయంపై శుక్రవారం సమావేశమైన బీసీసీఐ పాలకుల కమిటీ రద్దు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఛైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకుంటామని పేర్కొంది.
మే30 నుంచి వరల్డ్కప్ ఆరంభం కానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16న మాంచెస్టర్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో మ్యాచ్ను భారత్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు.
దీంతో మ్యాచ్ ఆడటంపై ఇప్పటి వరకూ స్పష్టమైన నిర్ణయం తీసుకోని బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. భారత్ జట్టు ఒకవేళ పాక్తో మ్యాచ్ను బహిష్కరిస్తే? అప్పుడు పాకిస్థాన్ను విజేతగా ప్రకటించి రెండు పాయింట్లు కేటాయిస్తారు.