
ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని ఏ పిచ్పై అయినా సరే రాణించగల సమర్థుడు కోహ్లీ. దాదాపు అన్ని దేశాల్లోనూ సెంచరీలు బాదాడు. అలాంటి కోహ్లీని మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరు? అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? ఇంగ్లిష్ పేసర్ ఆండర్సన్, ఆసీస్ స్పిన్నర్లు లియాన్, ఆడమ్ జంపా ఇలా లిస్టు తీస్తారు. కానీ కోహ్లీని అందరి కన్నా ఎక్కువ కష్టపడింది జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడానికని తెలుసా?
టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అప్పట్లో సౌతాఫ్రికాతో సిరీస్ కోసం భారత్ అక్కడకు వారం ముందుగానే వెళ్లింది. అక్కడ నెట్ ప్రాక్టీస్ సమయంలో బుమ్రాను ఎదుర్కొన్న కోహ్లీ.. నేరుగా కోచ్ రవిశాస్త్రి దగ్గరకు వెళ్లాడట. 'వీడిని ఆడటం చాలా కష్టం. అసలు బంతి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాడో పట్టుకోవడం కష్టంగా ఉంది. మిగతా వాళ్లతో పోలిస్తే వీడిని ఫాలో అవడంలో కొంత టైం పడుతోంది' అని చెప్పాడట. బుమ్రా బౌలింగ్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాడట కోహ్లీ.

ఆ తర్వాత మాటల మధ్యలో తను పూర్తి సామర్ధ్యంతో బౌలింగ్ చేయడం లేదని బుమ్రా చెప్పాడట. 'ఈ పిచ్లు మరీ ఎక్కువగా బౌలింగ్కు సహకరిస్తున్నాయి. ఇక్కడ పూర్తి సామర్ధ్యంతో బౌలింగ్ చేస్తే బ్యాటర్ల తరఫున అది కరెక్ట్ కాదు. వాళ్లు కూడా మన బ్యాటర్లే కదా' అన్నాడట. దీంతో అతన్ని ఆ టెస్టు మ్యాచ్లో ఆడించాలని డిసైడ్ అయిపోయిందట టీం మేనేజ్మెంట్. ఆ తర్వాత మిగతాదంతా చరిత్రే. అప్పటి నుంచి బుమ్రా ఒక్కసారి కూడా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటి వరకు 38 టెస్టు మ్యాచులు ఆడిన ఈ స్టార్ పేసర్ 128 వికెట్లతో రాణించాడు. భారత ప్రధాన పేసర్గా ఎదిగాడు.