హైదరాబాద్: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్పై ఐదు వన్డేల సిరిస్ను 4-0తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ధోని నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లీ ఇప్పటివరకు ఐదు టెస్టు సిరిస్లను గెలిచాడు. భారత్కు వరుసగా 18 టెస్టు విజయాలనందించాడు. ఈ నేపథ్యంలో మూడు ఫార్మెట్లలో కోహ్లీకి పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది.
ప్రస్తుతం భారత పరిమిత ఓవర్ల కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆజ్ తక్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ టెస్టు కెప్టెన్గా కోహ్లీ విజయవంతమవ్వడం సహజంగానే ధోనీపై ఒత్తిడి పెంచిందని చెప్పాడు. అయితే, కెప్టెన్గా కొంతకాలం ధోనీని కొనసాగించడమే మంచిదని పేర్కొన్నాడు.

వచ్చే ఏడాది స్వదేశంల జరగనున్న ఇంగ్లాండ్ వన్డే, టీ20 సిరిస్ ధోనికి ఎంతో కీలకమని వ్యాఖ్యానించాడు. కోహ్లీకి పరిమిత ఓవర్ల కెప్టెన్సీపై 'ఇది సమర్థనీయమైన ప్రశ్నే. టెస్టుల్లో కోహ్లి విజయం సెలెక్టర్ల మీద ఒత్తిడి పెంచుతుంది. అయితే, కోహ్లీ కొంతకాలం వేచి ఉండకతప్పదు. ఒకరోజు అతను తప్పకుండా వన్డేలకు కెప్టెన్ అవుతాడు. కానీ కొంతకాలం ఆగాలి. ఇక సెలెక్టర్లు 2019 వరల్డ్ కప్కు ఎవరిని కెప్టెన్గా నియమించాలనేదానిపై ఇప్పటినుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కాబట్టి రానున్న ఇంగ్లండ్ వన్డే, టీ-20 సిరీస్ ధోనీకి కీలకం' అని గంగూలీ మీడియాతో చెప్పాడు.
ప్రస్తుతం వన్డేలు, టీ20లకు కెప్టెన్గా ఉన్న ధోని ఆ నాయకత్వ బాధ్యలతను కోహ్లీకి అప్పగించి, అతడి నాయకత్వంలో ఆడక తప్పదంటూ టీమిండియా గత వారంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ కెప్టెన్సీలో ఆడటం ఇష్టంలేని ధోని క్రికెట్ కెరీర్ త్వరలోనే ముగిస్తుందని చెప్పాడు.
చివరిసారిగా న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరిస్లో ధోని బరిలోకి దిగాడు. ధోని నేతృత్వంలోని టీమిండియా కివీస్పై సిరిస్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ ల సిరిస్ను 4-0తో కోహ్లీ సేన గెలుచుకుంది. ఇంగ్లాండ్పై భారత్కు ఇదే అతిపెద్ద విజయం.