హైదరాబాద్: ముంబై టెస్టులో విజయం సాధించి ఇంగ్లాండ్పై 3-0తో భారత్ టెస్టు సిరిస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా ఓర్వలేని ఆ జట్టు ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. భారత్ విజయానికి కారణం ఇక్కడి స్లో పిచ్లే అంటూ ధ్వజమెత్తాడు.
పేస్కు అనుకూలించిన పిచ్లను తయారు చేసినందువల్లే ఇంగ్లాండ్ ఘోరంగా ఓటమి పాలైనట్లు ఆండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతకాదు భారత్ పిచ్లను రూపొందించే క్రమంలో పాటించాల్సిన సాంకేతిక పద్ధతులను పాటించలేదని ఆండర్సన్ విమర్శించాడు.

ఇదంతా కూడా విరాట్ కోహ్లే చెప్పడం వల్లే జరిగిందంటూ వ్యాఖ్యానించాడు. 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ అప్పట్లో బ్యాటింగ్ చేయడంలో చాలా ఇబ్బంది పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేశాడు. 'కోహ్లి ఆటలో మార్పు వచ్చిందని అనుకోవట్లేదు. అతడి బ్యాటింగ్లో లోపాలు ఇక్కడి పిచ్లపై కనిపించడం లేదంతే. పిచ్ల్లో వేగం, స్వింగ్ లేకపోవడం వల్లే ఇంగ్లాండ్లో మాదిరిగా అతడిని ఔట్ చేయలేపోయాం' అని పేర్కొన్నాడు.
'కాకపోతే స్పిన్ను బాగా ఆడగలిగే కోహ్లి, అదే చేశాడని భావిస్తున్నా. మా సిరీస్ ఓటమికి పూర్తిగా స్పిన్ అనుకూలించే పిచ్లే కారణం. ఇంగ్లాండ్లో అప్పడు కోహ్లీని ఏ రకంగా పేస్ బౌలింగ్తో ఇబ్బంది పెట్టేమో, అది ఇక్కడ పిచ్ల్లో కనిపించలేదు. ఇరు జట్ల మధ్యకు తేడా అదే. ఈ రకంగా చూస్తే కోహ్లి సాంకేతికంగా పరిణితి చెందాడని అనుకోవడం లేదు' అని విమర్శించాడు.
ఇక్కడ జయంత్ యాదవ్ను ప్రత్యేకంగా అండర్సన్ కొనియాడాడు. జయంత్ యాదవ్ పోటీదారుడని తమకు తెలుసని, అందులో భాగంగానే అతనికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పాడు. అయినా జయంత్ యాదవ్ అసాధారణంగా బ్యాటింగ్ చేశాడు. కొన్ని సందర్భాల్లో అవి విఫలం అవుతుంటాయని చెప్పుకొచ్చాడు. అతడి సెంచరీ తననేమీ ఆశ్చర్యపరచలేదన్నాడు.
ఇదిలా ఉంటే టెస్టులో చివరి రోజైన సోమవారం 182/6 ఓవర్ నైట్ స్కోరుతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. మ్యాచ్ ఆరంభంలోనే స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెయిర్ స్టోను పెవిలియన్కు పంపాడు. అర్ధసెంచరీ పూర్తి చేసిన బెయిర్ స్టో 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆ వెంటనే వోక్స్ (0)ను కూడా అశ్విన్ పెవిలియన్ బాట పట్టించాడు.
దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎక్కవ సేపు సాగలేదు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ను అధిగమించే క్రమంలో ఇంగ్లాండ్ చేతిలో రెండు వికెట్లతో పాటు ఇంకా 42 పరుగులు వెనుకబడి ఉంది. ఈ సమయంలో అశ్విన్ వరుస ఓవర్లలో రషీద్, ఆండర్సన్ లను పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. భారత్ ఘనవిజయం సాధించింది.
ఈ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.