
జట్టు ప్రధాన లోపం.. కోహ్లీ ఫిట్నెస్:
రెండో టెస్టు ఆడుతుండగా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పితో బాధపడ్డాడు. రెండో ఇన్నింగ్స్లో క్రీజులో నిలబడేందుకు, షాట్లు ఆడేందుకు, పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ మూడో టెస్టుకు ఆడేందుకు మిగిలి ఉన్న 5 రోజుల సమయంలో కోలుకుని తీరతానని హామీ ఇచ్చాడు. అప్పటికల్లా నొప్పి తగ్గి ఫిట్నెస్ సంతరించుకుంటానని పేర్కొన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో విరాట్ మూడో టెస్టు ఆడటం ఎంతో కీలకం. కాసేపైనా క్రీజులో కుదురుకుంటే మిగతా ఆటగాళ్లు అతడి నుంచి ప్రేరణ పొందుతారు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ జట్టులో ఆడకపోతే టీమిండియా పరిస్థితి ఏంటి?

ఓపెనర్లుగా ఎవరెవరొస్తారో:
ఇంగ్లాండ్తో రెండు టెస్టుల్లోనూ భారత ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేదు. శిఖర్ ధావన్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 39 పరుగులు చేశాడు. నాలుగు ఇన్నింగ్సుల్లో కలిపి కేఎల్ రాహుల్ 35, మురళీ విజయ్ 26 పరుగులు మాత్రమే చేశారు. లార్డ్స్ టెస్టులోనైతే విజయ్ రెండు సార్లూ అండర్సన్ బౌలింగ్లో డకౌట్ కావడం గమనార్హం. కేఎల్ రాహుల్కు అపార ప్రతిభ ఉన్నా అందుకు తగ్గట్టు రాణించలేదు. అంతకుముందు అతడికి వచ్చిన అవకాశాలూ తక్కువే. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో టీమిండియా ఎవరెవరిని ఓపెనర్లుగా పంపుతారో..?

ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్:
మూడో టెస్టులో కోహ్లీ ఐదుగురు బౌలర్లను ఆడించాలనుకుంటే కచ్చితంగా ఆరుగురు స్పెషలిస్టు బ్యాట్స్మెన్ను రంగంలోకి దించాల్సిందే. అలాంటప్పుడు పాండ్యను పక్కన పెట్టి ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్ను తీసుకోవాల్సిందే. ఇప్పటి వరకు కోహ్లీని మినహాయిస్తే అశ్విన్ మాత్రమే రెండు మ్యాచుల్లోనూ బ్యాట్తో కాస్త రాణించగలిగాడు. రహానె, పుజారా, దినేశ్ కార్తీక్, హార్దిక్ ఆశించిన మేర వరకు రాణించలేకపోయారు. ట్రెంట్బ్రిడ్జ్ పిచ్ స్వింగ్, పేస్కు అనుకూలిస్తే మాత్రం బంతితో సత్తా చాటుతున్న పాండ్యను కోహ్లీ తప్పించేందుకు ఇష్టపడతాడా?

కార్తీక్ స్థానంలోకి పంత్ వస్తాడా:
టీమిండియాలోకి పునరాగమనం చేసిన నాటినుంచి వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చక్కగా ఆడుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో క్లిష్ట సమయాల్లో రాణించి జట్టుకు అండగా నిలిచాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అనుభవం ఉన్న అతడు ఇంగ్లాండ్తో రెండు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. అయితే అతడు 4 ఇన్నింగ్సుల్లో చేసింది 0, 1, 20, 0 మాత్రమే. ఈ నేపథ్యంలో అందరి చూపూ ధోనీ వారసుడిగా భావిస్తున్న రిషబ్ పంత్పై పడింది. ఈ సిరీస్కు అతడిని బ్యాకప్ కీపర్గా ఎంపిక చేశారు. 2016-17 రంజీ సీజన్లో, ఐపీఎల్-18లో, భారత్-ఏ తరఫున అద్భుతంగా రాణించిన యువ వికెట్ కీపర్ రిషబ్పంత్తో టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడా?

జడేజాను తీసుకుంటే కుల్దీప్ పరిస్థితి:
లార్డ్స్ టెస్టులో కుల్దీప్ను ఆడించడం పొరపాటేనని కోహ్లీ అంగీకరించాడు. ఈ మ్యాచ్లో 9 ఓవర్లు వేసిన అతడు ఏకంగా 44 పరుగులు ఇచ్చాడు. ట్రెంట్బ్రిడ్జ్ పిచ్ టర్న్కు సహకరించకపోతే మాత్రం కుల్దీప్ బదులు వేరే పేసర్కు చోటు ఇవ్వాల్సిందే. అలాకాని పక్షంలో తన అనుభవంతో బ్యాటింగ్లోనూ రాణించగల పరుగులు చేయగల రవీంద్ర జడేజాను తీసుకోవాలా?


Click it and Unblock the Notifications













