న్యూఢిల్లీ: టీమిండియా వన్డే, టీ20 జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశంలోనే అత్యధిక బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. అంతేగాక, వాటి ద్వారా అధిక మొత్తంలో సంపాదిస్తున్నాడు. అయితే, ఒక విషయంలో మాత్రం విరాట్ కోహ్లీ.. ధోనీ కంటే ముందున్నాడు. అతనికంటే ఎక్కువ ధరను పలికిస్తున్నాడు.
విషయం ఏమిటంటే.. మహేంద్ర సింగ్ ధోనీ తను ఉపయోగిస్తున్న బ్యాట్పై స్పార్టన్ స్టిక్కర్ వేయించుకున్నందుకు గానూ రూ. 6 కోట్లు పొందుతున్నాడు. అయితే, టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీ మాత్రం తన బ్యాట్పై ఎంఆర్ఎఫ్ ప్రకటన వేయించుకున్నందుకు రూ. 8 కోట్లు తీసుకుంటుండటం గమనార్హం. అంటే ధోనీ కంటే రూ. 2 కోట్లు అదనంగా కోహ్లీ వెనకేసుకుంటున్నాడన్నమాట.
మైదానం నుంచి బయటికి వస్తే.. టీవీ ప్రకటనలు, ఎండార్స్మెంట్ల ద్వారా ధోనీ రూ. 8 కోట్లు సంపాదిస్తుండగా, కోహ్లీ రూ. 5 కోట్లు మాత్రమే పొందుతున్నాడు. కాగా, ధోనీ, యువరాజ్, కోహ్లీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఓ క్రీడా దుస్తుల తయారీ సంస్థ సీఈఓ తెలిపారు.

ప్రపంచ టీ20 జరుగుతున్న నేపథ్యంలో అనేక కంపెనీలు తమ కంపెనీలతో ఒప్పందాలు చేయించుకొని.. ఈ సందర్భంగా విస్తృత ప్రచారం కల్పించుకుంటున్నాయి. పుమా, నైక్, యూఎస్ ఫుట్వేర్, తదితర దేశ విదేశాలకు చెందిన కంపెనీలు పోటీ పడుతున్నాయి. టెన్నిస్ రాకెట్లను కూడా ఈ సందర్భంగా ప్రచారం చేసుకోవడం గమనార్హం.
జర్మనీ క్రీడా వస్తువుల తయారీ సంస్థ పుమా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్తో రూ. 4 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. యువరాజ్ బ్యాట్పై పుమా యాడ్ కనిపిస్తుంది. సురేష్ రైనా, రోహిత్ శర్మలు రూ. 2.5 నుంచి 3కోట్లు తీసుకుంటున్నారు. అజింక్యా రహానే తన బ్యాట్ పై ప్రకటన కోసం రూ. 1.5కోట్లు పొందుతున్నాడు. ఎమ్మార్ఎఫ్ ప్రకటనతో శిఖర్ ధావన్ రూ. 3 కోట్లు పొందుతున్నాడు.
విదేశీ ఆటగాళ్లతో పోల్చితే భారత ఆటగాళ్లు ఎక్కువ మొత్తంలో ప్రకటన ద్వారా సంపాదిస్తున్నారని స్పోర్ట్స్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ స్టార్లుగా ఉన్న ఏబి డివిలియర్స్, క్రిస్ గేల్ ఇప్పుడు భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబి డివిలియర్స్ రూ. 3.5 కోట్లకు ఎమ్మార్ఎఫ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. స్పార్టన్ తో క్రిస్ గేల్ రూ. 3కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.