
హైదరాబాద్: టీవీ క్రూ సిబ్బందిని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపరిచిన సంఘటన మంగళవారం ఈడెన్ గార్డెన్స్లో చోటు చేసుకుంది. శ్రీలంకతో గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ లోపాలపై దృష్టి పెట్టాడు.
ఇందులో భాగంగా మంగళవారం నెట్స్లో పాల్గొన్న కోహ్లీ ఫ్రంట్ ఫుట్ డ్రైవ్స్ షాట్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. దీనికోసం షార్ట్ హ్యాండిల్ ఉన్న బ్యాట్ను వినియోగించాడు. హ్యాండిల్ పరిమాణం తక్కువగా ఉంటే కింది భాగాన్ని గట్టిగా పట్టుకునే అవకాశం ఉంటుంది.
దీంతో షాట్ కచ్చితంగా ఆడుతూ బంతిని గాల్లోకి కాకుండా నేలబారుగా ఆడొచ్చు. నెట్స్లో మహమ్మద్ షమీ వేసిన బంతులను ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో కోహ్లీ ఆడిన షాట్ అక్కడ ఉన్న టీవీ క్రూ సిబ్బంది తలను బలంగా తాకింది. దీంతో వెంటనే ప్రాక్టీస్ని నిలిపివేసిన కోహ్లీ భారత జట్టు ఫిజియోని పిలిపించాడు.
టీవీ క్రూ సిబ్బందికి తగిన మెడికల్ చికిత్స అందిన తర్వాత కోహ్లీ తిరిగి తన ప్రాక్టీస్ను ప్రారంభించాడు. అంతకముందు నెట్స్లో పాల్గొనడానికి ముందు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సిబ్బందిని పిలిపించి మాట్లాడిన కోహ్లీ తన బ్యాట్ బ్లేడ్ మందాన్ని కార్పెంటర్తో అంగుళంమేర చెక్కించాడు.
ఇదిలా ఉంటే సోమవారం నెట్స్లో పాల్గొనని చటేశ్వర్ పుజారా మంగళవారం చాలా సేపు మైదానంలో గడిపాడు. ఓపెనర్ మురళీ విజయ్.. కోహ్లీకి బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఆ తర్వాత కోచ్ రవిశాస్త్రి, రవీంద్ర జడేజాతో కలిసి కోహ్లీ పిచ్ను పరిశీలించాడు. మరోవైపు శ్రీలంక ఆటగాళ్లు కూడా నెట్స్లో చెమటోడ్చారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.