టార్గెట్ 180..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ మరోసారి విఫలం అయ్యాడు. తొమ్మిది పరుగులకే అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ-53, విరాట్ కోహ్లీ-62, సూర్యకుమార్ యాదవ్-51 పరుగులు చేశారు. నెదర్లాండ్స్కు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

కేఎల్ విఫలమైనా..
రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్ను ఆరంభించారు. మూడో ఓవర్ నాలుగో బంతికి కేఎల్ రాహుల్ బలి అయ్యాడు. పాల్ వాన్ మీకెరెన్ వేసిన ఓవర్ అది. లెగ్ స్టంప్ మీద పడిన బంతిని ఫ్లిక్ చేయబోయి టైమింగ్ మిస్ అయ్యాడు రాహుల్. అది నేరుగా ప్యాడ్స్ను తాకింది. దీనితో బౌలర్ మీకెరెన్, వికెట్ కీపర్ స్కాట్ ఎడ్వర్డ్స్ గట్టిగా ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేయడం, అంపైర్ తన వేలిని పైకెత్తడం చకచకా సాగిపోయాయి.
రోహిత్ శర్మ అర్ధసెంచరీ..
కేఎల్ రాహుల్ మినహా మిగిలిన బ్యాటర్లందరూ సత్తా చాటారు. కేప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు పట్టాలెక్కాడు. తన ఆటను గాడినపెట్టాడు. నెదర్లాండ్స్ బౌలర్లను ఒక ఆట ఆడించాడు. 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు హిట్ మ్యాన్. ఇందులో మూడు క్లాసిక్ సిక్స్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. క్లాసెన్ బౌలింగ్లో భారీ షాట్ను డీప్ మిడ్ వికెట్లో అక్కెర్మాన్ అందుకున్నాడు.
కోహ్లీ మళ్లీ..
అనంతరం బ్యాటింగ్కు దిగిన విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోయాడు. 44 బంతుల్లో మూడు బౌండరీలు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. చివరి వరకూ నిలిచాడు కోహ్లీ. సూర్యకుమార్ యాదవ్ తన ప్రతాపం చూపాడు. 25 బంతుల్లో 51 పరుగులతో విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్లో ఒక సిక్స్, ఏడు ఫోర్లు ఉన్నాయి. పాకిస్తాన్తో మ్యాచ్లో విఫలమయ్యాడు సూర్యకుమార్ యాదవ్. ఫలితంగా తన ర్యాంక్ను కూడా కోల్పోయాడు. ఈ మ్యాచ్లో మళ్లీ ట్రాక్ ఎక్కాడు.
కేఎల్ మినహా..
ఒక్క కేఎల్ రాహుల్ మినహా క్రీజ్లోకి వచ్చిన మిగిలిన బ్యాటర్లందరూ ధాటిగా ఆడటం శుభపరిణామమే. నెదర్లాండ్స్కు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం అభిమానులను ఒకింత నిరుత్సాహ పరిచింది. టార్గెట్ 200లకు పైగా ఉంటుందనే అంచనాలు వ్యక్తమైనప్పటికీ.. దానికి ఆమడదూరంలో ఆగింది టీమిండియా స్కోర్ బోర్డ్.


Click it and Unblock the Notifications












