ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ వచ్చేసింది. ఈ తుదిపోరులో అగ్రశ్రేణి జట్లు న్యూజిలాండ్ - టీమిండియా హోరాహోరీగా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 9న దుబాయ్ వేదికగా ఇది జరగనుంది. దేశప్రజలంతా భారత్ గెలవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు కూడా మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో భారత స్టార్స్ రోకో - రోహిత్ కోహ్లీ .. భారత్ క్రికెట్ అభిమానులకు ప్రత్యేక సందేశం పంపారు.
"ఇన్నేళ్ల నుంచి మాకు మద్దతునిస్తూ అండగా నిలుస్తోన్న ప్రతిఒక్కరికీ, అభిమానులకు ధన్యవాదాలు. మాకు మీ మద్దతు చాలా అవసరం. మీరు ఇలానే మీ మద్దతును కొనసాగిస్తే మేమందరం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంటాం. నేను కచ్చితంగా మిమ్మల్ని నిరుత్సాహపరచము. మేము కచ్చితంగా మా వంతుగా మాలో ఉన్న శక్తినంతా ఉపయోగించి ఉత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తాం." అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

"అభిమానుల మద్దతు, ప్రేమను మేం ఎప్పుడూ ఎంతో విలువైనదిగా భావిస్తాం. ఎంతో గౌరవిస్తాం. మీరు నిజంగా మా వెనుక ఉన్నారు. మీ మద్దతుకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడిని. మేం ఎప్పుడూ నిబద్ధతతో ఉంటూ, మైదానంలో మేం చేయగలిగినదంతా మీకు అందిస్తాం. భారత జెండాను ఉన్నత స్థాయిలో రెపరెపలాడేలా చేస్తాం. అలానే మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాం" అని విరాట్ కోహ్లీ అన్నాడు.
"మీ సపోర్ట్, మీ అభిమానం ఎప్పుడూ మాకే ఉండాలని కోరుకుంటున్నాను. మా వంతుగా ఉత్తమంగా రాణిస్తాం. ట్రోఫీని ఇంటికి తీసుకొస్తాం." అని హార్దిక్ పాండ్య చెప్పాడు.