|
ఆశీర్వదించండి..
‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది' అని నటాషాతో కలిసి దిగిన ఫొటోలను పాండ్యా పోస్ట్ చేశాడు.
మా జీవితాల్లోకి కొత్త ప్రాణి రానుంది..
ఓఇక నటాషా కూడా తాను గర్భవతిననే విషయాన్ని ఇన్స్టాలో తెలిపింది. హార్దిక్తో ఉన్న ఫొటోను పోస్టు చేసింది. ‘మా ఇద్దరి ప్రయాణం మరింత అపురూపంగా మారనుంది. మా జీవితాల్లోకి కొత్త ప్రాణి రానుంది. ఇద్దరం ఎంతో ఉత్కంఠతో ఉన్నాం. మీ ఆశీర్వాదం కావాల'ని నటాషా రాసింది. గుజరాత్కు చెందిన 26 ఏళ్ల హార్దిక్ పాండ్యా 2016లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు.
విషెస్ చెప్పిన భారత క్రికెటర్లు
ఈ సందర్భంగా హార్దిక్-నటాషాలకు భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు చెప్పారు. ‘ఇద్దరికి కంగ్రాట్స్.. అమితమైన ప్రేమతో మీ జీవితాల్లోకి రాబోతున్న మూడో వ్యక్తికి నా బ్లెస్సింగ్స్'అని విరాట్ కోహ్లీ విషెస్ తెలపగా.. యుజ్వేంద్ర చహల్, రవిశాస్త్రి, కేఎల్ రాహుల్తో పాటు ఇతర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు.
పాండ్యా రీ ఎంట్రీ కి కరోనా బ్రేక్
గతేడాది సెప్టెంబర్లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్తో పునరాగమనం చేయాల్సింది. కానీ తొలి వన్డే వర్షంతో తుడిచిపెట్టుకుపోగా.. కరోనా దెబ్బకు సిరీస్ మొత్తం రద్దయింది. దీంతో ఎన్నో ఆశలతో రీఎంట్రీ ఇవ్వాలనుకున్న పాండ్యాకు బాధే మిగిలింది. ఇక ఈ సిరీస్ ముందు హార్దిక్ తన ఫిట్నెస్ను నిరూపించుకునే క్రమంలో రెచ్చిపోయి ఆడాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్ టీ20 కప్లో రిలయన్స్-1 తరఫున ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అటు తన విధ్వంసకర బ్యాటింగ్తో పాటు బౌలింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ కరోనా అతని ఆశలను అడియాశలు చేసింది.