అఫ్గానిస్థాన్తో జరిగిన రెండో టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలోనే ఛేదించింది. 14 నెలల తర్వాత టీ20 జట్టులోకి తిరిగొచ్చిన విరాట్ కోహ్లి ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. యాంకర్ ఇన్నింగ్స్ కాకుండా ఆది నుంచే దూకుడుగా ఆడుతూ అయిదు బౌండరీలు బాదాడు.
ఈ నేపథ్యంలో కోహ్లిని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు. కోహ్లికి పరిస్థితులకు తగ్గట్టుగా గేర్లు మార్చే సత్తా ఉందని అన్నాడు. ''ఇలాంటి ప్రదర్శన గత ప్రపంచకప్ ముందు కూడా చూశాం. ఆది నుంచే అతడు దాడి చేయగలడు. దూకుడుగా ఆడాలని అతడు నిర్ణయించుకుంటే అది చేయగలడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ జట్టుకు ఎలాంటి కోహ్లి మనకు కావాలో ఆలోచించుకోవాలి. ప్రతి బంతిని భారీ షాట్ ఆడాలనే విధానం కోహ్లి, రోహిత్కు సెట్ అవ్వదు''

''ప్రపంచకప్ జరగనున్న వెస్టిండీస్, అమెరికా పిచ్లను పరిశీలిస్తే 150-160 పరుగులు చేసే వికెట్లు ఉంటాయే కానీ, 200-220 రన్స్ చేసే పిచ్లు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో కోహ్లి యాంకర్ ఇన్నింగ్స్ ఆడాలి. ఇన్నింగ్స్కు ఇరుసులా మారాలి. అతడు అలా చేస్తేనే మరో ఎండ్లో ఉన్న ప్లేయర్లు ఫ్రీగా బ్యాటింగ్ చేయగలుగుతారు. టీ20ల్లో కూడా అతడు వన్డే ప్రపంచకప్ తరహా ఇన్నింగ్స్ ఆడాలి''
''అడవిలోకి వెళ్తే మనం ఎందుకు భయపడతాం? అక్కడ సింహం ఉంటుందని. అయితే సింహం ప్రతిసారి మనల్ని తినే సందర్భాలు ఉండవు. కానీ అది ఎక్కడ దాడి చేస్తుందనే ఎక్కువగా భయపడుతుంటాం. విరాట్ కోహ్లి కూడా సింహం లాంటి వాడు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థులకు ఆందోళనే. భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అతడు ఎప్పుడైనా గేర్లు మార్చగలడు. గేమ్ను ఫినిష్ చేయగలడు. అడవిలో సింహంలా ఇక్కడ కోహ్లి చాలా కీలకం. వేటాడాలా వద్దా అనేది సెపరేట్ స్టోరీ'' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.