
విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఆదివారం పెర్త్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన T20 ప్రపంచ కప్ సూపర్ 12 గ్రూప్ 2 మ్యాచ్లో విరాట్ కోహ్లీ T20 ప్రపంచ కప్ చరిత్రలో 1000 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు.ఈ మ్యాచ్లో కోహ్లి 12 పరుగులకే ఔటైనా అతని ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. కోహ్లి టీ20 వరల్డ్కప్ల్లో 22 ఇన్నింగ్స్లు ఆడి 80కి పైగా సగటుతో 1001 పరుగులు చేయడంతో పాటు 12 హాఫ్ సెంచరీలు చేశాడు.
కోహ్లీ కంటే ముందు మహేల జయవర్దనే ఉన్నాడు. జయవర్దనే 31 మ్యాచ్ల్లో 1016 పరుగులు చేశాడు. కోహ్లీ తన 24వ మ్యాచ్ (22వ ఇన్నింగ్స్)లో టీ20 ప్రపంచకప ల్లో 1000 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో కోహ్లి 28 పరుగులు చేసి ఉంటే జయవర్దనేను అధికమించేవాడు. టీ20 ప్రపంచకప్ల్లో అత్యధిక అర్ధసెంచరీలు (12) సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. క్రిస్ గేల్, రోహిత్ శర్మ చెరో తొమ్మిది అర్ధ సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, దినేష్ కార్తిక్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఈ మ్యాచ్ లో రాణించాడు. 40 బంతుల్లో 3 సిక్స్ లు, 6 ఫోర్లతో 68 పరుగులు చేశాడు.