అసలు విషయం ఏమిటంటే..
ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ రోజ్బౌల్ స్టేడియంలో శనివారం ఆప్ఘనిస్తాన్తో మ్యాచ్ను అతి కష్టం మీద గెలుచుకుంది టీమిండియా. టాస్ గెలిచిన తరువాత భారీ స్కోరు చేయాలనే ఉద్దేశంతో కేప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పరిస్థితి అతను ఆశించిన దానికి భిన్నంగా కనిపించింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నందుకు బహుశా కోహ్లీ పశ్చాత్తాపడి ఉండొచ్చు. అంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు. తొలి నాలుగు ఓవర్లలో ఏడు పరుగులే చేయడం, రోహిత్ శర్మ వికెట్ కోల్పోవడం.. 50 ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 224 పరుగులే స్కోరుబోర్డులో జత కావడం.. ఇవన్నీ కోహ్లీని అసహనానికి గురి చేసి ఉండొచ్చు.
ఫీల్డింగ్లో అంపైర్పై..
ఈ అసహనాన్నంతటినీ విరాట్ కోహ్లీ అంపైర్పై ప్రదర్శించాడా? అనేలా ప్రవర్తించాడతను. ఫీల్డింగ్ సందర్భంగా అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వివాదానాకి దిగాడు. చేతులు జోడించి మరీ గట్టిగా అప్పీల్ చేస్తూ కనిపించాడు. ఆప్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ హజ్రతుల్లా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మహమ్మద్ షమీ సంధించిన ఓ బంతి అతని ప్యాడ్లను తాకింది. దీనిపై షమీ, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, కేప్టెన్ కోహ్లీ.. వీరంతా ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. అయినప్పటికీ.. అంపైర్ ఉలకలేదు, పలకలేదు. దీనితో కోహ్లీ అసహనానికి గురయ్యాడు. షమీ, ధోనీలతో మాట్లాడాడు. అనంతరం డీఆర్ఎస్ కోరాడు.
చేతులు జోడించి..
ఈ సందర్భంగా కోహ్లీ అంపైర్లతో కొద్దిసేపు వాదించాడు. చేతులు జోడించి.. బంతి స్టంప్స్ మీదుగా వెళ్లిందని అంటూ అంపైర్లతో వాదులాడాడు. అప్పటికీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు అంపైర్లు. చివరకు డీఆర్ఎస్లోనూ అతనికి ఎదురుదెబ్బే తగిలింది. అప్పీల్ సందర్భంగా విరాట్ కోహ్లీ అంపైర్లతో వాగ్వివాదానికి దిగడం పట్ల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అతనిపై చర్యలకు దిగింది. భారీగా జరిమానా విధించింది. విరాట్ కోహ్లీకి దక్కాల్సిన మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రవర్తనా నియమావళి (ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్)లోని ఆర్టికల్ 2.1 ప్రకారం.. కోహ్లీ ప్రవర్తన విరుద్ధమైనదని ఐసీసీ ప్రతినిధి తెలిపారు.
ఆర్టికల్ 2.1 నియమాన్ని ఉల్లంఘించిన కోహ్లీ..
అంపైర్లతో దురుసుగా ప్రవర్తించాడని, ఇది ఆర్టికల్ 2.1 ప్రకారం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఈ స్థాయిలో అప్పీల్ చేయడం, అంపైర్లతో వాగ్వివాదానికి దిగడం వంటి చర్యలు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. తీవ్రమైనదిగా భావిస్తారు. లెవెల్ 1 నిబంధనను ఉల్లంఘించిట్లుగా గుర్తిస్తారు. దీని ప్రకారం.. కోహ్లీపై చర్యలు తీసుకుంది ఐసీసీ. అతనికి దక్కాల్సిన మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అలీమ్దార్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించారు. రిచర్డ్ కెటిల్ బోరో థర్డ్ అంపైర్గా ఉన్నారు.