
హైదరాబాద్: కేప్టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 72 పరుగులు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక సరిగా లేదంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని తప్పుబడుతూ అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.
ముఖ్యంగా గతంలో దక్షిణాఫ్రికా గడ్డపై అద్భుత ప్రదర్శన చేసిన రహానేను కాదని అతడి స్ధానంలో రోహిత్ శర్మను తీసుకోవడంపై విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేప్టౌన్ టెస్టులో రహానే స్ధానంలో జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో రోహిత్ శర్మ ఎంపికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. రోహిత్ శర్మను ఎంపిక చేయడానికి గల కారణాలను వెల్లడించాడు.
'ప్రస్తుత ఫామ్ ఆధారంగానే మేం అతన్ని తుది జట్టులోకి తీసుకున్నాం. తాను ఆడిన చివరి మూడు టెస్టు మ్యాచ్లలో రోహిత్ బాగానే స్కోర్ చేశాడు. శ్రీలంక సిరీస్లో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఓ జట్టుకు అదే కీలకం కూడా. విమర్శలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జట్టు బాగా ప్రాక్టీస్ చేసింది. కానీ, విఫలం అయ్యాం' అని కోహ్లీ అన్నాడు.
ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ సైతం టీమిండియా తుది జట్టులో జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మల ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.