స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. ఉప్పల్ టెస్టులో బరిలోకి దిగడానికి కోహ్లి హైదరాబాద్కు కూడా చేరుకున్నాడు. కానీ కొన్ని కారణాలతో అదే రోజు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. బీసీసీఐ, టీమిండియా మేనేజ్మెంట్ అనుమతి తీసుకుని కోహ్లి జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో రజత్ పటిదార్ టీమిండియాలోకి వచ్చాడు.
అయితే కోహ్లిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. క్రికెట్ పట్ల కోహ్లి అభిరుచి, అంకితభావం అద్భుతమని, అతడు ఎప్పుడూ పరుగుల దాహంతో ఉంటాడని రోహిత్ అన్నాడు. ''ఆట పట్ల కోహ్లి అభిరుచి, అంకితభావం ఓ అద్భుతం. పరుగులు చేయాలనే ఆకలితో ఎప్పుడూ ఉంటాడు. ప్రతి సందర్భంలోనూ జట్టు కోసం గొప్పగా పోరాడుతుంటాడు. అతడిని దగ్గరగా చూసే అవకాశం కలగడం నా అదృష్టం. కోహ్లిని చూసి యువ క్రికెటర్లు ఎంతో నేర్చుకోవాలి''

''అవిరామంగా క్రికెట్ ఆడే కోహ్లి తాను కావాలనుకుంటే రెండు, మూడు సిరీస్లు తేలికగా తీసుకోవచ్చు, విశ్రాంతి కోరుకోవచ్చు. కానీ కోహ్లి అలా చేయడు. ప్రతి సమయంలోనూ క్రికెట్ కోసం అందుబాటులో ఉంటాడు. యువ క్రికెటర్ల నుంచి ఇదే ఆశిస్తున్నా. ఇక విరాట్ తన కెరీర్లోనే ఇప్పటివరకు ఎన్సీఏకి వెళ్లలేదు. అతడి ఫిట్నెస్కు ఇది నిదర్శనం'' అని రోహిత్ అన్నాడు. గాయపడిన క్రికెటర్లు ఎన్సీఏకు వెళ్లి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధిస్తుంటారు. ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టే కోహ్లి ఇప్పటివరకు ఆటలో గాయపడలేదు.
కాగా, భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా 436 పరుగులు సాధించి 190 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే ఇంగ్లిష్ జట్టు గొప్పగా పోరాడుతుంది. ఎనిమిది వికెట్లు కోల్పోయి 419 పరుగులతో కొనసాగుతోంది. ఒలీ పోప్ (195*) డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 229 పరుగుల ఆధిక్యంలో ఉంది. వికెట్ల కోసం టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.