
ఆటగాళ్ల వేతనాల గురించి చర్చించాం
అనంతరం సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ మాట్లాడుతూ 'చాలా అంశాలపై చర్చించాం. ఇందులో ఆడాల్సిన మ్యాచ్ల సంఖ్య, భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ), ఆటగాళ్ల వేతనాల గురించి చర్చించాం. ఆట అభివృద్ధికి సంబంధించి ఇతరులకు మార్గదర్శకంగా నిలిచే పరిష్కారాన్ని కనుగొన్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కెప్టెన్, కోచ్లు త్వరలోనే మాకు అందజేయగానే తుది నిర్ణయం తీసుకుంటాం. బోర్డు ఆదాయం నుంచి ఆటగాళ్లకు ఏ మేరకు చెల్లింపులు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది' అని అన్నారు.


ఆటగాళ్ల జీతాల పెంపు మాత్రం అనివార్యం
ఆటగాళ్ల జీతాల పెంపులో ఎంత పెరిగేది కచ్చితంగా చెప్పనప్పటికీ పెంపు మాత్రం అనివార్యమని ఆయన పేర్కొన్నారు. ఆడుతున్న మ్యాచ్లకు, చెల్లిస్తున్న పారితోషికాలకు మధ్య ఆర్థిక సమతౌల్యం తీసుకొస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం గ్రేడ్-ఎ ఆటగాడికి ఏడాదికి రూ. 2 కోట్లు.. గ్రేడ్-బి ఆటగాడికి రూ. కోటి.. గ్రేడ్-సి ఆటగాడికి రూ. 50 లక్షలు ఇస్తున్నారు. టెస్టు మ్యాచ్ తుది జట్టులోని వారికి రూ. 15 లక్షలు.. వన్డే తుది జట్టులోని వారికి రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్ తుది జట్టులోని వారికి రూ. 3 లక్షల మ్యాచ్ ఫీజులను బీసీసీఐ చెల్లిస్తోంది.

గ్రేడ్-ఎ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్
ఇక, తుది జట్టులో లేని ఆటగాళ్లకు అందులో సగం మొత్తాన్ని ఇస్తారు. మరోవైపు టెస్టు క్రికెట్కే పరిమితమైన ఆటగాళ్లు నష్టపోకుండా ఉండేలా వేతన ఒప్పందాలను సవరించే అవకాశముందని తెలుస్తోంది. అయితే గతంలో అనిల్ కుంబ్లే ప్రధాన కోచ్గా ఉన్న సమయంలో గ్రేడ్-ఎ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఆటగాళ్ల వార్షిక జీతాలు పెంచాల్సిన అవసరముందని అన్నాడు. దీనిపై డిసెంబర్ 11న జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

డిసెంబరు 27న దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న కోహ్లీసేన
ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జులైలో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా రెండు వారాల ముందే అక్కడికి వెళ్లనుంది. ఈ మేరకు బోర్డు వర్గాలు తెలిపాయి. ఇంగ్లాండ్ స్ధానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం కోహ్లీసేన శ్రీలంకతో సిరిస్ ఆడుతుంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు శనివారం (డిసెంబర్ 2)న ఢిల్లీ వేదికగా ప్రారంభం కానుంది. టెస్టు సిరిస్ అనంతరం మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఈ సిరిస్ ముగిసిన రెండు రోజుల్లో అంటే డిసెంబరు 27న దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.


Click it and Unblock the Notifications











