న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన బ్యాట్స్మన్ శిఖర్ ధావన్, స్పీడ్ బౌలర్ ఇషాంత్ శర్మలు ఢిల్లీ వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్టుకు గౌతమ్ గంభీర్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. డిసెంబర్ 10-18 వరకు జరిగే విజయ్ హజారే ట్రోఫీలో గంభీర్ సేన.. నార్త్ జోన్తో తలపడనుంది.
పాకిస్థాన్తో ప్రస్తుతం భారత్ మ్యాచులు ఆడే అవకాశం లేనట్లుగా కనిపిస్తుండటం, ఆస్ట్రేలియా భారత పర్యటన జనవరిలో ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురు ఆటగాళ్లు గంభీర్ నాయకత్వంలోని జట్టు తరపున హజారే ట్రోఫీలో ఆడనున్నారు.
ఒకవేళ పాకిస్థాన్ సిరీస్ ఉండే అవకాశం ఉంటే.. ఈ ముగ్గురు భారత జట్టుకు వెళ్లిపోతారు. అలాకానీ పక్షంలో హజారే ట్రోఫీలో పాల్గొంటారు. వినయ్ లంబా నేతృత్వంలోని ఎంపిక కమిటీ వీరిని ఈ ట్రోఫీకి ఎంపిక చేసింది. అయితే భారత జట్టుకు టెస్ట్ కెప్టెన్గా ఉన్న కోహ్లీనే ఈ జట్టుకు కూడా కెప్టెన్ ఎందుకు ఎంపిక చేయలేదనేదానిపై ఆయన స్పందించలేదు.

'మొత్తం సీజన్లో గౌతమ్ గంభీర్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అంతర్జాతీయ మ్యాచులు ఆడే ఆటగాళ్లు ఎప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో విరాట్ కోహ్లీ ఆడటం అనేది పెద్ద విషయమేమి కాదు' అని లంబా అన్నారు.
జాతీయ జట్టు ఆటగాళ్లు ఈ ట్రోఫీలో ఖచ్చితంగా ఆడతారో లేదో కూడా తెలియదని అన్నారు. దీనిపై వారిని సంప్రదిస్తున్నామని చెప్పారు. మొదట ఇశాంత్ శర్మ పేరును తీసుకోలేదని, తర్వాత అతడ్ని జట్టులో చేర్చడం జరిగిందని తెలిపారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ట్రోఫీ సమయానికి లభించని పక్షంలో వీరి స్థానాల్లో ఆడేందుకు మరో ముగ్గురు ఆటగాళ్లను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
2013లో ఛాలెంజర్స్ ట్రోఫీ టోర్నమెంటులో విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున ఆడాడు. ఆ సమయంలోనూ కోహ్లీ.. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ల నాయకత్వంలోనే ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆశీష్ నెహ్రాను కూడా ప్రస్తుత టోప్రీకి గౌతమ్ జట్టులోకి తీసుకున్నారు.
స్క్వాడ్: గౌతమ్ గంభీర్(కెప్టెన్), ఉన్ముక్త్ చంద్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, నితీష్ రానా, మిలింద్ కుమార్, మనం శర్మ, పవన్ నెగి, ఆశిష్ నెహ్రా, ప్రదీప్ సంగ్వాన్, ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ, సుబోధ్ భటి, శివం శర్మ, రాహుల్ యాదవ్ (వికెట్ కీపర్) .
స్టాండ్ బై: ధృవ్ షోరే(శిఖర్ ధావన్), వైభవ్ రావల్(విరాట్ కోహ్లీ), వికాస్ తోకస్(ఇషాంత్ శర్మ).