
మెల్బోర్న్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల రికార్డును మరో 7-8 ఏళ్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అధిగమిస్తాడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. తన నైపుణ్యం, ఫిట్నెస్, మానసిక బలంతో కోహ్లీ ఎలాంటి రికార్డులనైనా బద్దలు కొడతాడని అన్నాడు. సచిన్ 16 సంవత్సరాల వయస్సులో పాక్ జట్టుపై అరంగేట్రం చేసి ప్రపంచ ఐకానిక్ క్రికెటర్లలో ఒకడు అయ్యాడు.
తాజాగా బ్రెట్ లీ 'స్టార్ స్పోర్ట్స్' క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ... 'ఒకప్పుడు సచిన్లో ఉన్న లక్షణాలు ఇప్పుడు కోహ్లీలో కూడా ఉన్నాయి. కోహ్లీకి ఎంతో నైపుణ్యం ఉంది. అంతేకాక గొప్ప ఫిట్నెస్ సొంతం. ఇక తన మానసిక బలంతో కఠిన మ్యాచ్ల్లో, విదేశాల్లోనూ రాణిస్తున్నాడు. కానీ సచిన్ని దాటి వెళ్లే సత్తా ఎవరికి లేదు. ఆయన క్రికెట్కి దేవుడు. మనం ఎదురుచూడటం తప్ప ఏం చేయలేము. ఒక అరుదైన, అద్భుతమైన రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న ఫామ్లో కోహ్లీ ఉంటే.. మరో 7-8 ఏళ్లలో వంద సెంచరీల రికార్డునుసాధించగలడు' అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.
సచిన్ టెండూల్కర్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. వీటిలో 51 సెంచరీలు ఉన్నాయి. 463 వన్డేల్లో 49 సెంచరీలు చేసిన అతడు 18,426 పరుగులు సాధించాడు. ఇక విరాట్ కోహ్లీ 86 టెస్టుల్లో 27 శతకాలతో 7,240 పరుగులు, 248 వన్డేల్లో 43 సెంచరీలతో 11,867 పరుగులు చేశాడు. ఇప్పటికే సచిన్ రికార్డుకు విరాట్ చేరువలో ఉన్నారు. సచిన్ కంటే కోహ్లీ 30 శతకాల వెనుకంజలో ఉన్నాడు.
ఇటీవల ఓ టెలివిజన్ షోలో బ్రెట్ లీ తన అనుభవాలను వివరించాడు. ఏ బౌలర్కు మీరు బయపడుతారు అని హోస్ట్ అడగ్గా.. అందరికి అని లీ సమాధానం ఇస్తాడు. ఇక షోయబ్ అక్తర్ బౌలింగ్ను ఏ విధంగా ఎదుర్కొన్నాడనేది కూడా చెప్పుకొచ్చాడు. 'నేను బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రతీ ఒక్క బౌలర్కు భయపడేవాడిని. ముఖ్యంగా స్పిన్నర్లకు కూడా. ఇక షోయబ్ అక్తర్ బౌలింగ్కు కూడా భయపడేవాడిని. అతడు బౌలింగ్ చేస్తుంటే.. నన్ను చంపడానికే బౌలింగ్ వేస్తున్నాడేమోనని అనిపించేది' అని బ్రెట్ లీ తెలిపాడు. లీ ఆసీస్ తరపున 76 టెస్టుల్లో 310 వికెట్లు, 221 వన్డేల్లో 380 వికెట్లు తీశాడు.