హైదరాబాద్: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక, బౌలింగ్లో సైతం జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్పై 2-1తో టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఆ జట్టుతో మూడు వన్డేలు, న్యూజిలాండ్లో ఐదు వన్డేలు ఆడనుంది.
చర్యలకు సిద్ధం: నోరు జారిన పాండ్యా, రాహుల్లకు షోకాజ్ నోటీసులు
ఈ నేపథ్యంలో బుధవారం ఐసీసీ వన్డే ర్యాంకులను ప్రకటించింది. జట్టు ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న టీమిండియా వరుసగా ఎనిమిది మ్యాచ్లు గెలిస్తే 125 పాయింట్లతో ఇంగ్లాండ్కు చేరువ అవుతుంది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఖాతాలో 126 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
ఇక, నాలుగో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను అధిగమించాలంటే, పాకిస్థాన్ 5-0తో సిరీస్ గెలవాలి. వన్డే ర్యాంకింగ్స్లో బ్యాటింగ్ జాబితాలో 899 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రోహిత్ శర్మ 871 రేటింగ్ పాయింట్లతో రెండు స్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో ఉండగా కుల్దీప్ యాదవ్ మూడో ర్యాంకులో నిలిచాడు. శ్రీలంకపై 3-0తో అద్భుత విజయం సాధించిన న్యూజిలాండ్ ఆటగాళ్ల తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. ఈ సిరిస్లో పరుగుల వరద పారించిన రాస్ టేలర్ మూడు స్థానంలో, మార్టిన్ గుప్టిల్ పద్నాలుగో స్థానంలో నిలిచాడు.