హైదరాబాద్: వన్డేల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టెస్టుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్లు అత్యుత్తమ ఆటగాళ్లని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. సెప్టెంబర్ 17 నుంచి ఆసీస్తో ప్రారంభమయ్యే ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్లో టీవీ కామెంటేటర్గా వ్యవహరించనున్న మైకేల్ క్లార్క్ మంగళవారం ఓ టీవీ కార్యక్రమంలో వీవీఎస్ లక్ష్మణ్తో కలిసి పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ స్టీవ్స్మిత్ మధ్య పోలికపై క్లార్క్ మాట్లాడాడు. 'వన్డేల్లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్మన్ అయితే టెస్టుల్లో స్మిత్ గొప్ప ఆటగాడు. కెప్టెన్సీ విషయానికొస్తే ఇద్దరూ సమానమే. ఇప్పుడిప్పుడే తమ నాయకత్వశైలిని మెరుగుపర్చుకుంటున్నారు. కోహ్లీ లాగే భారత జట్టు కూడా ఈ మధ్య దూకుడుతనంతో దూసుకెళుతున్నది' అని క్లార్క్ అన్నాడు.

శ్రీలంక పర్యటనలో వరుస సెంచరీలతో ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాటింగ్ రికార్డును సమం చేసి దూకుడు మీద ఉన్న కోహ్లీ, గత కొద్దికాలంగా అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న స్టీవ్స్మిత్లలో బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అని మీడియా అడిగిన ప్రశ్నకు క్లార్క్ పైవిధంగా సమాధానం ఇచ్చాడు.
ప్రస్తుత జట్టు భారత మాజీ కెప్టెన్ గంగూలీ నాయకత్వంలోని జట్టును గుర్తుచేస్తోందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత టీమిండియా దూకుడైన ఆటగాడి నాయకత్వంలో మంచి క్రికెట్ ఆడుతుందని కొనియాడాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ జట్టు ఓటమిని సహించలేదని క్లార్క్ పేర్కొనడం విశేషం.
'సౌరభ్, విరాట్లకు పోలికలున్నాయి. గంగూలీ ఎప్పుడూ వెనుకంజ వేసేవాడు కాదు. జట్టులో పోటీ వాతావరణం నెలకొల్పడంలో అతడిది కీలక పాత్ర. ధోని, కుంబ్లే, కోహ్లి ఎవరి శైలిలో వారు జట్టును నడిపించారు. ప్రస్తుతం ఓటమిని ఎంతమాత్రం అంగీకరించని, దూకుడైన కెప్టెన్ నాయకత్వంలో భారత్ ఆడుతోంది' అని క్లార్క్ అన్నాడు.
ఐపీఎల్ ద్వారా ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారత్.. రెండో ఇల్లుగా మారిందని క్లార్క్ చెప్పుకొచ్చాడు. ఇక ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్వుడ్లు గాయాలతో సతమవుతుండటంతో ఈ సిరీస్లో కొనసాగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని క్లార్క్ తెలిపాడు.
ఈ పర్యటనలో ఆస్ట్రేలియా 4-1తో సిరీస్ను గెలిస్తే వన్డే ర్యాకింగ్లో అగ్రస్ధానం దక్కించుకుంటుందని క్లార్క్ అన్నాడు. ఇక్కడి పరిస్థితులు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు పెద్దగా ఇబ్బంది కలిగించవని ఎందుకంటే చాలా మంది ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటంతో భారత్ వారికి రెండో ఇల్లుగా మారిందని అన్నాడు.