
హైదరాబాద్: 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. ముంబైలో ప్రతిష్టాత్మక క్లబ్ అయిన 'ఖర్ జింఖానా'లో గౌరవ సభ్యత్వాన్ని కోల్పోయాడు. సోమవారం జరిగిన మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఖర్ జింఖానా సంయుక్త కార్యదర్శి గౌరవ్ కాపాడియా వెల్లడించారు.
ఈ మేరకు హార్దిక్ పాండ్యా సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లు ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. తమకు కొత్తగా జారీ చేసిన రెండో షోకాజ్ నోటీసులకు బదులిస్తూ తమను మన్నించాలని వీరిద్దరు విజ్ఞప్తి చేశారు.
బేషరతు క్షమాపణ చెప్పినా... వారి కష్టాలు ఇంకా తొలగిపోలేదు. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ ఆదేశాలను అనుసరించి బోర్డు నిబంధన 41 (సి) ప్రకారం వీరిద్దరిపై సీఈఓ రాహుల్ జోహ్రీ విచారణ కొనసాగించనున్నారు. అయితే, ఇటీవలే యువతులను వేధించిన ఆరోపణలు ఎదుర్కొన్న బీసీసీఐ సీఈఓ జోహ్రీతోనే విచారణ జరిపించడంపై సీఓఏ మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు.