ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. ఆసీస్ బౌలర్లు ముందు నిలవలేక వరుసగా పెవిలియన్కు క్యూ కడుతున్నారు. రెండో ఇన్నింగ్స్లో 56 పరుగులకే సగం మంది వెనుదిరిగారు. టాప్ ఆర్డర్ మరోసారి దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో భారత్-ఏ 11 పరుగులకే నాలుగు, 64 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే.
సెకండ్ ఇన్నింగ్స్లో ఆరంభంలోనే భారత్ వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (17; 31 బంతుల్లో, 2 ఫోర్లు)ను నాథన్ మెక్ఆండ్రూ ఔట్ చేశాడు. కాసేపటికే వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ (3; 8 బంతుల్లో)ను కూడా పెవిలియన్కు చేరాడు. వెబ్స్టర్ బౌలింగ్లో వికెట్ కోల్పోయాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (11; 20 బంతుల్లో, 1 ఫోర్) నిరాశపరిచాడు.

ఆ తర్వాత కేఎల్ రాహుల్ (10; 44 బంతుల్లో), దేవదత్ పడిక్కల్ (1; 19 బంతుల్లో) వెనుదిరిగారు. అయితే కేఎల్ రాహుల్ వినూత్న రీతిలో వికెట్ సమర్పించుకున్నాడు. స్పిన్నర్ కోరి రోకిసియోలి వేసిన బంతిని రాహుల్ డిఫెండ్కు ప్రయత్నించాడు. అయితే బంతి కాస్త బౌన్స్ అవ్వడం, లెగ్సైడ్కు వెళ్తుండటంతో బ్యాటుతో కాకుండా ప్యాడ్లతో డిఫెండ్కు రాహుల్ ట్రై చేశాడు. కానీ బంతి రాహుల్ కాళ్ల మధ్య నుంచి వెళ్లి బెయిల్స్ను పడగొట్టింది. రాహుల్ ఎడమతొడకు తాకి రైట్ స్టంప్పై ఉన్న బెయిల్స్కు బాల్ తాకింది.
తొలి ఇన్నింగ్స్లో నాలుగు పరుగులే చేసి నిరాశపర్చిన రాహుల్ రెండో ఇన్నింగ్స్లో దురదృష్టవశాత్తు వికెట్ కోల్పోయాడు. న్యూజిలాండ్తో జరిగిన చివరి రెండు టెస్టుల్లో తుదిజట్టులో చోటు కోల్పోయిన రాహుల్ టీమిండియా కంటే ముందే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ప్రాక్టీస్ కోసం ఆస్ట్రేలియాకు వచ్చాడు. భారత్-ఏ జట్టు తరఫున ఓపెనర్గా ఆడుతున్నాడు. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఉండటంతో, భారత్-ఏకు ఓపెనర్గా ఆడమని రాహుల్ను టీమిండియా మేనేజ్మెంట్ ఆదేశించింది. కానీ రాహుల్ రెండు ఇన్నింగ్స్ల్లో సత్తాచాటలేకపోయాడు. కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాతో టీమిండియా అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
"Don't know what he was thinking!"
— cricket.com.au (@cricketcomau) November 8, 2024
Oops... that's an astonishing leave by KL Rahul 😱 #AUSAvINDA pic.twitter.com/e4uDPH1dzz