కేఎల్ రాహుల్ (101; 137 బంతుల్లో) శతకం సాధించాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో వన్ మ్యాన్ షో తో అదరగొట్టాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు ధాటికి సహచరులు వరుసగా వెనుదిరిగినా పోరాడుతూ స్కోరుబోర్డు నడిపించాడు. రెండో రోజు ఆటలో టెస్టును టీ20లా మార్చాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు.
ఓవర్నైట్ స్కోరు 208/8తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. అయితే 105 బంతుల్లో 70 పరుగులతో క్రీజులోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ 133 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. ఈ క్రమంలో రాహుల్ చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్ మైదానంలో రెండు సెంచరీలు సాధించిన ఏకైక పర్యాటక జట్టు ప్లేయర్గా నిలిచాడు. 2021-22 దక్షిణాఫ్రికా పర్యటనలో ఇదే గ్రౌండ్లో అతడు 123 పరుగులు చేశాడు.

అయితే రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే సిరాజ్ (5)ను కొయెట్జీ ఔట్ చేశాడు. దాంతో అప్పటికీ 95 పరుగులు చేసిన రాహుల్ సెంచరీ సాధిస్తాడా లేదా అనే ఉత్కంఠ మొదలైంది. కానీ అదే ఓవర్లో కొయెట్జీ బౌలింగ్లో సిక్సర్ బాది మూడంకెల స్కోరు అందుకున్నాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో బర్గర్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై రాహుల్ బౌల్డయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ అయిదు వికెట్లు, బర్గర్ మూడు, జేన్సన్, కొయెట్జీ చెరో వికెట్ తీశారు.
మంగళవారం జరిగిన ఆటలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ(5), యశస్వీ జైశ్వాల్ (17), శుభ్మన్ గిల్ (2) వరుసగా పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత విరాట్ కోహ్లి (38), శ్రేయస్ అయ్యర్ (31) జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డును నడిపించారు. అయితే లంచ్ బ్రేక్ అనంతరం రబాడ చెలరేగి శ్రేయస్, కోహ్లిని ఔట్ చేసి భారత్ను కోలుకోలేని దెబ్బ తీశాడు.
ఆ తర్వాత వచ్చిన అశ్విన్ (8) కూడా ఔటవ్వడంతో టీమిండియా 121 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ కేఎల్ రాహుల్ గొప్పగా పోరాడి టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చాడు. శార్దూల్ ఠాకూర్ (24) పరుగులు చేశాడు.