
భవిష్యత్తులో టీమిండియాలో చోటు కాపాడుకోవడం కూడా కేఎల్ రాహుల్కు కష్టంగా మారుతుందని టీమిండియా మాజీ దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే టీమిండియా పరిమిత ఓవర్ల సారధిగా హార్దిక్ పాండ్యాను సానబెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడే జట్టు బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది. అయితే ఈ జట్టులో రోహిత్, రాహుల్ లేకపోవడం గమనార్హం.
ఆ తర్వాత అదే జట్టుతో జరిగే వన్డే సిరీస్లో జట్టుకు రోహిత్ కెప్టెన్సీ చేస్తుండగా.. రాహుల్ ఉన్నప్పటికీ అతని డిప్యూటీగా పాండ్యానే నియమించారు. ఈ లెక్కన చూస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత భావి కెప్టెన్గా పాండ్యాను బీసీసీఐ చూస్తోందన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. అదే సమయంలో నిన్నమొన్నటి వరకు భావి కెప్టెన్ అనుకున్న కేఎల్ రాహుల్ స్థానం ప్రమాదంలో పడింది. టీ20 ఫార్మాట్లో రాహుల్ కెరీర్ దాదాపు ముగిసినట్లే. టీ20 వరల్డ్ కప్లో అతని చెత్త ప్రదర్శనతో ఈ విషయం స్పష్టమైంది.
ఇక వన్డేల్లో కూడా అతని ఓపెనర్ స్థానానికి యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ చెక్ పెట్టాడు. శిఖర్ ధవన్ను కాదని సెలెక్టర్లు తనను ఎంపిక చేసేలా సత్తా చాటాడు. దీంతో కేఎల్ రాహుల్ కూడా ఓపెనింగ్ స్థానం వదులుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే భవిష్యత్తులో వన్డే ఫార్మాట్లో వికెట్ కీపింగ్ చేస్తూ మిడిలార్డర్లో రాహుల్ ఆడాల్సి ఉంటుంది. అదే సమయంలో మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ఉండనే ఉన్నారు. కావాలంటే ఇషాన్ కిషన్ కీపింగ్ కూడా చేయగలడు. దీంతో టీమిండియా మిడిలార్డర్లో కేవలం రెండు స్థానాలు ఖాళీగా ఉంటాయి. వాటి కోసం అయ్యర్, సూర్యకుమార్, రాహుల్ మధ్య పోటీ ఉంటుంది. ఈ క్రమంలో రాహుల్ ఏమాత్రం తడబడినా అతనికి జట్టులో చోటు దక్కడం అసాధ్యంగా కనిపిస్తోంది.