
బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో పేలవంగా ఆడుతున్న భారత బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒకడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సులలో 20లలోనే అతను పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో రెండో టెస్టులో అతి జాగ్రత్తగా ఆడుతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 30 బంతులు ఎదుర్కొన్న అతను కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై మాజీ లెజెండ్ మనీందర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశాడు.
మామూలుగా అయితే బౌండరీలు బాదే కనీసం ఆరు బంతులను రెండో టెస్టులో రాహుల్ వదిలేశాడని మనీందర్ చెప్పాడు. అసలు అతనికి ఇలా ఆడాలని ఎవరు చెప్తున్నారని ప్రశ్నించాడు. తన సహజసిద్ధమైన ఆటతీరును పక్కన పెట్టేసి, బలవంతంగా ఎవరో రుద్దిన ఆటను రాహుల్ ఆడుతున్నాడని విమర్శించాడు. రాహుల్ ఏమీ చిన్న పిల్లాడు కాదని, అంతర్జాతీయ స్థాయిలో మంచి అనుభవం ఉన్న ఆటగాడని చెప్పాడు. అలాంటి వాడికి ఇలాంటి సలహాలు మంచి చెయ్యవని అభిప్రాయపడ్డాడు.
ఇలా తెచ్చిపెట్టుకున్న ఆట ఆడటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉందని మనీందన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. మళ్లీ ఏ ఇరవై పరుగులో చేసినప్పుడు ఒక మంచి బాల్ పడితే రాహుల్ తన వికెట్ పారేసుకుంటాడని భయంగా ఉందన్నాడు. తను ఎదుర్కొన్న 30 బంతుల్లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరే ప్రమాదాన్ని రాహుల్ తప్పించుకున్న విషయాన్ని మనీందర్ గుర్తుచేశాడు. ఈ బంతిని ఎదుర్కోవడానికి రాహుల్ క్రీజు దాటి ముందుకు రావడంతో బతికిపోయాడని, అతనికి అదృష్టం కలిసొచ్చిందన్నాడు.
ఇంతకాలం పరుగులు చేసిన తన సహజ సిద్ధమైన ఆటనే రాహుల్ ఆడితే మంచిదని మనీందర్ చెప్పాడు. లేకపోతే పరుగులు చేయడం అతనికి కష్టం అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో ఏదైనా మంచి బంతి ఎదురైతే వికెట్ పారేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. తనను అడిగితే తన నేచురల్ గేమ్ ఆడటమే రాహుల్కు బెస్ట్ అని, ఈ తెచ్చిపెట్టుకున్న ఆటను ఆడటం వల్ల ఉపయోగం లేదని తేల్చిచెప్పాడు.