
సౌతాఫ్రికా పర్యటనలో ఎవరూ ఊహించని రీతిలో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. టెస్టు సిరీస్ను 1-2తో కోల్పోయిన టీమిండియా... వన్డే సిరీస్లో అయితే ఏకంగా వైట్ వాష్ అయింది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఓటమిపై స్పందించాడు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓటమిపై స్పందించిన రాహుల్.. కష్టతరమైన ప్రయాణాలు మనల్ని మరింత మెరుగు పర్చడానికి, బలంగా ఎదగడానికి సహాయపడతాయని రాసుకొచ్చాడు. మనం ప్రయాణించే దారిలో ఎదురయ్యే ఫలితాలు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చని, కానీ అందుకు కారణమైన తప్పుల నుంచి తాము నేర్చుకుంటామని చెప్పుకొచ్చాడు. కాగా దేశానికి నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. అది మాటల్లో వర్ణించలేనని ట్వీట్ చేశాడు. అలాగే మనం మెరుగు పడడంపై దృష్టి పెట్టడం వల్ల పని ఆగదని, దానిని ఎప్పుడూ వదులు కోకూడదని తెలిపాడు. చివరగా తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ రాహుల్ ధన్యవాదాలు తెలిపాడు.
కాగా కెప్టెన్గా రాహుల్కు సౌతాఫ్రికా పర్యటనలో తీవ్ర నిరాశ ఎదురైంది. టెస్ట్ మ్యాచ్తో కలుపుకుని మొత్తంగా 4 మ్యాచ్లకు నాయకత్వం వహిస్తే ఒక్క దాంట్లో కూడా భారత జట్టును గెలిపించలేకపోయాడు. విరాట్ కోహ్లీ గైర్వాహజరీలో మొదటగా టెస్టు సిరీస్లో జోహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో రాహుల్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఆ మ్యాచ్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత మూడో టెస్టులోనూ ఓడి సిరీస్ను కూడా కోల్పోయింది. మూడో టెస్టుకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో వన్డే సిరీస్లో టీమిండియాకు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. కాగా తొలి వన్డేలో టీమిండియా 31 పరుగులతో ఓడిపోయింది. అనంతరం సెకండ్ వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక మూడో వన్డేలో 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ వన్డే సిరీస్లో బ్యాటర్గా కూడా రాహుల్ రాణించలేకపోయాడు. అంతేకాకుండా కెప్టెన్గా తన ఫెయిల్యూర్ వ్యూహాలతో విమర్శలపాలవుతున్నాడు. దీంతో టీమిండియా భవిష్యత్ కెప్టెన్గా మన్ననలు అందుకుంటున్న కేఎల్ రాహుల్ సామర్థ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. టీమిండియా తదుపరి కెప్టెన్గా రాహుల్ సరైన వ్యక్తి కాదేమోననే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్తోపాటు పలువురు మాజీ ఆటగాళ్లు రాహుల్కు మద్దతుగా నిలుస్తున్నారు. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.