పూర్తిగా ఫిట్ నెస్ సాధించకముందే ఆసియా కప్, ప్రపంచకప్ కు ఎందుకు ఎంపిక చేశారని కేఎల్ రాహుల్ పై మొదట్లో విమర్శలు వచ్చాయి. కానీ రాహుల్ నిలకడగా పరుగులు సాధిస్తూ విమర్శకులకు బ్యాటర్లతోనే సమాధానమిచ్చాడు. ఫైనల్ లో ఆస్ట్రేలియా మ్యాచ్ తో సహా ఎన్నో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. మెగాటోర్నీలో 10 ఇన్నింగ్స్ లో 75 సగటుతో 452 పరుగులు చేశాడు.
అయితే కేఎల్ రాహుల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ లో మిడిలార్డర్ బ్యాటర్ గా, ప్రధాన వికెట్ కీపర్ గా పూర్తి బాధ్యతలు అందుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్ లో టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఆ ప్రపంచకప్ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ గా స్థానం దక్కించుకోవాలని రాహుల్ నిర్ణయించకున్నట్టు తెలుస్తోంది.

దీని గురించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ దవ్రిడ్, టీమ్ మేనేజ్మెంట్ తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తో కూడా ఈ విషయాన్ని చర్చించినట్లు సమాచారం. వికెట్ కీపింగ్ లో కేఎల్ రాహుల్ కు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఇషాన్ కిషాన్ ఉన్నాడు. అయితే వరల్డ్ కప్ లో టీమ్ మేనేజ్మెంట్ తొలి ప్రాధాన్యత రాహుల్ కే ఇచ్చింది. మరోవైపు రిషభ్ పంత్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో టీ20ల్లో కూడా మిడిలార్డర్ లో తన స్థానాన్ని కేఎల్ రాహుల్ సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు.
దానికి తగ్గట్టుగా కేఎల్ రాహుల్ ఐపీఎల్ లోనూ మిడిలార్డర్ గానే వచ్చే సీజన్ లో బరిలోకి దిగుతున్నాడని తెలుస్తోంది. ఐపీఎల్లో రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. లక్నో జట్టులో ఓపెనర్లుగా రాహుల్ తో పాటు క్వింటన్ డికాక్, మేయిర్స్ ఉన్నారు. అంతేగాక ఇటీవల జట్టులోకి దేవదత్ పడిక్కల్ కూడా వచ్చాడు. దీంతో మిడిలార్డర్ స్థానంలో రాహుల్కు ఫ్రాంచైజీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు రాహుల్ కెప్టెన్ గా జట్టును నడిపించనున్నాడు.